బెంగళూర్ : కర్నాటక ఉడిపి జిల్లాలో నూతనంగా నిర్మించిన రోడ్డుకు నాథూరాం గాడ్సే రోడ్డు పేరుతో వెలిసిన సైన్బోర్డు కలకలం రేపింది. మహాత్మా గాంధీ హంతకుడు గాడ్సే పేరుతో సైన్ బోర్డు ఏర్పాటు చేయడం గమనించిన గ్రామ పంచాయతీ అధికారులు స్ధానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
పదుగిరి నాథూరాం గాడ్సే రోడ్డు పేరుతో ఏర్పాటు చేసిన సైన్ బోర్డును తొలగించిన అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ బోర్డును ఏర్పాటు చేసిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సైన్బోర్డ్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కర్నాటక ఇంధన శాఖ మంత్రి వి సునీల్ కుమార్ నియోజకవర్గంలోని బోలో గ్రామ పంచాయితీలో ఈ సైన్ బోర్డు ఏర్పాటైంది.
ఈ బోర్డును ప్రభుత్వం, గ్రామ పంచాయితీ అధికారులు ఏర్పాటు చేయలేదని, ఇది కొందరి దుండగుల పని అని మంత్రి పేర్కొన్నారు. రెండు రోజుల కిందట తాము ఈ బోర్డును గుర్తించి పంచాయితీ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశామని కర్నాటక యూత్ కాంగ్రెస్ చీఫ్ యోగేష్ ఇన తెలిపారు. వివాదం రేపేందుకు కొందరు దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని వారిపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.