తాను అధికారం కోసం రాజకీయాల్లో కొనసాగడం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కేవలం భారత మాత కోసమే రాజకీయాల్లో వున్నానన్నారు. తాను రాజకీయాలను కెరీర్గా మార్చుకోవడం లేదని, ఉన్న కేరీర్నే వదిలి వచ్చేశానని అన్నారు. ఆప్ అధినేత, సీఎం కేజ్రీవాల్ ఆదివారం నాగపూర్లో పర్యటించారు. అధికారమన్న గద్దె నెక్కడానికి రాజకీయాల్లో లేనని, దేశాన్ని రక్షించడానికే పాలిటిక్స్లో వున్నానని చెప్పుకొచ్చారు.
తాను భగవంతుడికి రెండే రెండు కోరికలు కోరుకుంటున్నట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు. మొదటిది భారత దేశం ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానాన్ని సాధించాలని ఆకాంక్షించారు. ఇక రెండోది… భారత్ ఈ స్థాయికి చేరే వరకు తాను మరణించవద్దన్న కోరికను కూడా కోరుతానని అన్నారు.
తనకు రాజకీయాలు చేయడం ఎంత మాత్రమూ రాదని ఆయన పునరుద్ఘాటించారు. పని చేయడం ఒక్కటి మాత్రమే వచ్చని అన్నారు. గూండాగిరీ చేయడం, అవినీతి చేయడం, దొంగతనాలు చేయడం కూడా తనకు రాదని, పాఠశాలలు, ఆస్పత్రులు నిర్మించడం మాత్రమే వచ్చని పేర్కొన్నారు.
ఉద్ధవ్ నేతృత్వంలోని మహావికాస్ అగాఢీపై కూడా విమర్శలు చేశారు. మహారాష్ట్రలో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ ఏమాత్రం బాగోలేదని, అధ్వాన్నంగా ఉందంటూ విమర్శలు చేశారు. మొదలు ఢిల్లీలోనూ ఇదే గతి అని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మార్చేశామన్నారు.