పనాజీ: గోవాను దేవుడే కాపాడాలని కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం వ్యాఖ్యానించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గోవా ప్రజలకు, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) గుప్పిస్తున్న హామీలపై ఈ మేరకు ఆయన విమర్శించారు. టీఎంసీ నేత మహువా మోయిత్రా శనివారం మాట్లాడుతూ గోవాలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు ఆదాయానికి మద్దతుగా గృహ లక్ష్మీ పథకం కింద ప్రతి ఇంటిలోని ఒక మహిళ బ్యాంకు ఖాతాకు నెలకు రూ.5,000 బదిలీ చేస్తామని చెప్పారు.
కాగా, టీఎంసీ నేత చేసిన ఈ హామీపై గోవా ఎన్నికల కాంగ్రెస్ ఇంచార్జీ అయిన చిదంబరం ఆదివారం స్పందించారు. ‘ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతికి అర్హమైన లెక్క ఇదిగోండి. గోవాలోని 3.5 లక్షల కుటుంబాల్లోని ఒక మహిళకు రూ.5,000 నెలవారీ గ్రాంట్ కింద నెలకు రూ. 175 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే సంవత్సరానికి రూ.2100 కోట్లు. 2020 మార్చి నాటికి రూ. 23,473 కోట్ల రుణాన్ని కలిగిన గోవా రాష్ట్రానికి ఇది “చిన్న” మొత్తం. ‘దేవుడు గోవాను ఆశీర్వదిస్తాడు!’ లేక ‘గోవాను దేవుడే కాపాడాలా?’’ అని ట్విట్టర్లో ఎద్దేవా చేశారు.