పనాజీ : కరోనా తీవ్రత దృష్ట్యా గోవాలో ఇవాళ రాత్రి 7 గంటల నుంచి మే 3వ తేదీ ఉదయం వరకు లాక్డౌన్ అమలు చేయనున్నారు. ఈ మేరకు ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, అత్యవసర సేవలు, వివిధ పరిశ్రమలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా అత్యవసర వస్తువుల రవాణా కోసం రాష్ట్ర సరిహద్దులు తెరిచే ఉంటాయని సీఎం వెల్లడించారు. కానీ, ప్రజారవాణా వ్యవస్థను నిలిపివేస్తామన్నారు. క్యాషినోలు, హోటళ్లు, పబ్లు మూసే ఉంటాయని చెప్పారు. వలస కూలీలు ఎవరూ కూడా రాష్ర్టాన్ని వదిలిపెట్టి పోవద్దు అని సీఎం సావంత్ విజ్ఞప్తి చేశారు.