పనాజీ : గోవాలో కొవిడ్ మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తొలి కేసు నమోదైంది. యూకే నుంచి వచ్చిన ఎనిమిదేళ్ల బాలుడిలో వేరియంట్ను గుర్తించారు. సదరు బాలుడు డిసెంబర్ 17న యూకే నుంచి గోవాకు రాగా.. సోమవారం ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రాణే సోమవారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అవసరమైన మేరకు కఠిన చర్యలు తీసుకుంటుందని రాణే పేర్కొన్నారు.
రాబోయే నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఉత్సవాల సందర్భంగా కరోనా వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా చూడాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆదేశించారు. ఆదివారం, గోవాలో 25 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,80,050కు పెరగ్గా.. మరణాల సంఖ్య 3,519కు పెరిగింది.