పనాజీ: ఫ్లాట్, కారు కొనేందుకు జడ్జీ చాంబర్ వద్ద ఉన్న సాక్ష్యాల గదిలోని డబ్బు, నగలను ఒక న్యాయవాది చోరీ చేశాడు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల ద్వారా గుర్తించిన పోలీసులు చివరకు అతడ్ని అరెస్ట్ చేశారు. బీజేపీ పాలిత గోవాలో ఈ సంఘటన జరిగింది. పనాజీ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు జడ్జీ చాంబర్లోని సాక్ష్యాల గదిలో డబ్బులు, బంగారు ఆభరణాలు ఉన్నాయి. వాల్పోయికి చెందిన న్యాయవాది ముజాహిదీన్ షేక్కు వీటిపై కన్నుపడింది. వాటిని చోరీ చేసి ఫ్లాట్, కారు కొనాలని అతడు భావించాడు.
కాగా, చోరీ కోసం షేక్ నాలుగు రోజుల పాటు కోర్టు ఆవరణలో రెక్కీ నిర్వహించాడు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు కోర్టుకు వచ్చాడు. టాయిలెట్ రూమ్లో దాక్కున్నాడు. కోర్టు సిబ్బంది అంతా వెళ్లిన తర్వాత బయటకు వచ్చాడు. న్యాయమూర్తి చాంబర్ వద్ద ఉన్న సాక్ష్యాల గదిలోకి వెళ్లాడు. అందులో ఉన్న నగదు, నగలు చోరీ చేశాడు. రాత్రి 9.30 సమయంలో కోర్టు ప్రాంగణం నుంచి బయటకు వెళ్లిపోయాడు.
మరోవైపు సాక్ష్యాల గదిలోని డబ్బు, బంగారు ఆభరణాలు మాయం కావడాన్ని కోర్టు సిబ్బంది బుధవారం గుర్తించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. కోర్టుతో పాటు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. న్యాయవాది ముజాహిదీన్ షేక్ ఈ చోరీకి పాల్పడినట్లు నిర్ధారించారు. ఎనిమిది పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి అతడ్ని పట్టుకుని అరెస్ట్ చేశారు. గోవాతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలోని కోర్టుల్లో కూడా ఈ న్యాయవాది ప్రాక్టీస్ చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.