పనాజీ : తౌక్టే తుఫాన్ ప్రభావం కారణంగా రాష్ట్రానికి రూ. 146 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతిఒక్కరిని ఆదుకుంటామని ఆయన స్పష్టం చేశారు. పెనుగాలుల తీవ్రతకు మూడురోజులుగా మత్స్యకారులు సముద్రంలోని వెళ్లడం లేదు. ఉపాధి లేకుండా ఇబ్బందిపడుతున్న వారికి అండగా ఉంటామన్నారు. భీకర్ గాలుల కారణంగా తలెత్తిన పరిస్థితిని చక్కదిద్దేందుకు విపత్తు నిర్వహణ బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయని ఆయన చెప్పారు.
‘‘తుఫాన్ ధాటికి చాలాచోట్ల పంట నష్టం సంభవించింది. ఇండ్లు నేలమట్టమయ్యాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. విద్యుత్ తీగలు తెగిపోయాయి. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ ఆస్తులు దెబ్బతిన్నాయి’’ అని సీఎం పేర్కొన్నారు. 1994 తరువాత తుఫాన్ రాష్ట్రంపై ఈ స్థాయి ప్రభావం చూపడం ఇదే తొలిసారని ఆయన వెల్లడించారు. చాలాప్రాంతాల్లో రోజులుగా విద్యుత్ సరఫరా, తాగునీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు ప్రజలు తనను క్షమించాలని అన్నారు. సిబ్బంది కొరత కారణంగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు సమయం పడుతుందని సీఎం సావంత్ స్పష్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.