గోవాలో బ్లేమ్ గేమ్ ప్రారంభమైంది. కాంగ్రెస్, దాని మిత్రపక్షం గోవా ఫార్వర్డ్ పార్టీ ఒకరిపై ఒకరు కత్తులు దూస్తున్నారు. ఎన్నికల్లో ఘోర పరాభవం మీ వల్లే అంటే.. మీ వల్లే అంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇదే విషయంపై కాంగ్రెస్ నేత విజయ్ భికే మాట్లాడుతూ కొన్ని విమర్శలు చేశారు. ఎన్నికల సందర్భంగా గోవా ఫార్వర్డ్ పార్టీతో పొత్తు పెట్టుకొని తాము ఘోరమైన తప్పిదం చేశామని తీవ్రంగా మండిపడ్డారు. ఈ పొత్తు వల్ల కాంగ్రెస్ కు వచ్చిన లాభమేమీ లేదని పెదవి విరిచారు.
ఈ పొత్తు వల్ల మరో పార్టీ లాభపడిందని వ్యాఖ్యానించారు. మాయెమ్, మాండ్రెమ్ లాంటి కీలక సీట్లలో గోవా ఫార్వర్డ్ పార్టీ అధ్యక్షుడు విజయ్ సర్దేశాయ్ విఫలమయ్యారని ఆరోపించారు. 2017 లో ఆ పార్టీ ఓట్ల శాతం 3.5 శాతం ఉంటే, ప్రస్తుత ఎన్నికల్లో 1.8 శాతానికి పడిపోయిందని కాంగ్రెస్ నేత విజయ్ భికే విశ్లేషించారు.
గోవా విషయంలో కాంగ్రెస్ అనేక ఆశలు పెట్టుకుంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచే గోవాపై అధిష్ఠానం దృష్టి సారించింది. చిదంబరం లాంటి సీనియర్ నేతకు గోవా బాధ్యతలను అప్పజెప్పింది. ఎలాగైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తలపోశారు. కానీ ఎన్నికల్లో కాంగ్రెస్కు కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీకి 20 సీట్లు వచ్చాయి.