Global Corruption: ప్రపంచ అవినీతి సూచీ (Global Corruption Index) లో భారత్ మరింత దిగజారింది. గత ఏడాది (2022) కంటే ఈ ఏడాది (2023) ఎనిమిది స్థానాలు దిగువకు పడిపోయింది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ రిపోర్టు ప్రకారం.. 2023 ఏడాదికిగాను మొత్తం 180 దేశాల్లో భారత్ 93వ స్థానంలో నిలిచింది. 2022లో భారత్ ర్యాంక్ 85గా ఉంది.
ప్రపంచంలోని వివిధ దేశాల్లో ప్రభుత్వ రంగ అవినీతి స్థాయిల ఆధారంగా ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ప్రతి ఏడాది ఈ నివేదికను రూపొందిస్తుంది. తాజాగా 2023కు సంబంధించిన నివేదికను వెల్లడించింది. అవినీతి స్థాయిని బట్టి దేశాలకు 0 నుంచి 100 వరకు స్కోర్ ఇస్తుంది. అత్యంత అవినీతి ఉన్న దేశానికి 0 స్కోర్, అవినీతి రహిత దేశానికి 100 స్కోర్ను కేటాయిస్తుంది.
ఈ ఏడాది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ భారత్కు 39 స్కోర్ ఇచ్చింది. దాంతో భారత్ 93వ ర్యాంక్లో నిలిచింది. గత ఏడాది ఇండియా 40 స్కోర్తో 85వ ర్యాంక్లో ఉంది. ఇక దక్షిణాసియా దేశాల్లో పాకిస్థాన్, శ్రీలంక అత్యంత అవినీతి దేశాలుగా నిలిచాయి. శ్రీలంక 115వ ర్యాంకులో, పాకిస్థాన్ 133వ ర్యాంకులో ఉన్నాయి. బంగ్లాదేశ్ 149వ ర్యాంకులో ఉన్నప్పటికీ.. గతంతో పోల్చితే ఇప్పుడు అవినీతి భారీగా తగ్గుతోంది.
ఇక అవినీతి నిర్మూలన కోసం చైనా శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. గడిచిన దశాబ్ద కాలంలో చైనా ఏకంగా 30.70 లక్షల మంది ప్రభుత్వ అధికారులకు శిక్షలు విధించింది. దాంతో ప్రస్తుతం చైనా 76వ ర్యాంకుకు ఎగబాకింది. మరోవైపు న్యూజిలాండ్, సింగపూర్ దేశాలు వరుసగా 3, 5 ర్యాంకులతో జాబితాలో టాప్ ప్లేస్లో ఉన్నాయి. అవినీతి నిర్మూలన చర్యలతో ఆస్ట్రేలియా (14), హాంగ్కాంగ్ (14), జపాన్ (16), భూటాన్ (26), తైవాన్ (28), దక్షిణకొరియా (32) కూడా తమ ర్యాంకులను మెరుగుపర్చుకున్నాయి.
ఇకపోతే అత్యంత అమానవీయ పాలనవల్ల ఆఫ్ఘనిస్థాన్ 162వ ర్యాంకుతో జాబితాలో అడుగున ఉన్నది. మయన్మార్ కూడా శ్రీలంకతో సమంగా 162వ ర్యాంకులోనే కొనసాగుతున్నది. నియంత కిమ్ పాలనలోని ఉత్తరకొరియా 172వ ర్యాంకుతో జాబితాలో మరింత దిగువన ఉన్నది.