న్యూఢిల్లీ, మే 20: దేశవ్యాప్తంగా 45 ఏండ్లు పైబడిన వారికి టీకా బాధ్యతను తీసుకొన్న కేంద్రం అంతకు తక్కువ వయస్సున్నవారి బాధ్యతను రాష్ర్టాలకు వదిలేసింది. అంతేగాక దేశంలో ఉత్పత్తి అవుతున్న టీకాల్లో సగం తన వద్దే పెట్టుకొని వాటిని రాష్ర్టాలకు.. అది కూడా 45 ఏండ్లు దాటినవారికి ఉచిత టీకా పంపిణీ కోసం కేటాయించింది. మరోవైపు, 18-44 ఏండ్ల వయస్సున్నవారికోసం రాష్ర్టాలు నేరుగా కంపెనీల దగ్గర నుంచి టీకాలు కొనుగోలు చేయవచ్చని తెలిపింది. టీకా వేయించుకోవాలనుకునే వ్యక్తుల కోసం (18-44 ఏండ్ల వారికి) కొవిన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. ఫలితంగా టీకాలకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. కానీ దేశంలో ఉత్పత్తి అవుతున్న టీకాలు సరిపోక 18-44 ఏండ్ల వయస్సున్నవారికి టీకాలు అందడం లేదు. కేంద్రం నుంచి టీకాలు రాక, దేశంలోని కంపెనీలు ఉత్పత్తి పెంచక రాష్ర్టాలు విదేశీ కంపెనీలవైపు చూస్తున్నాయి. ఈ మేరకు గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తున్నాయి. గడిచిన 15 రోజుల్లోనే తొమ్మిది రాష్ర్టాలు 21 కోట్ల కరోనా టీకాల కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించాయి.
18-44 ఏండ్ల వయస్సున్నవారిలో రోజూ 20 లక్షల మంది టీకా కోసం కొవిన్ పోర్టల్లో తమ పేర్లను నమోదు చేసుకొంటున్నారు. ఈ లెక్కన జూలై చివరికి 20 కోట్ల మంది రిజిస్టర్ కావొచ్చని అంచనా. ఇప్పటికే 6.5 కోట్ల మంది రిజిస్టర్ చేసుకొన్నారు.వీరిలో ఇప్పటివరకు కేవలం 70 లక్షల మందికే టీకా లభించింది. జూలై చివరికి దేశంలో భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ నుంచి 13 కోట్ల డోసులు వస్తాయని అంచనా. అయినప్పటికీ మరో 7 కోట్ల డోసులకు కొరతే ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ర్టాలు గ్లోబల్ టెండర్లను పిలవక తప్పని పరిస్థితి నెలకొన్నది.