న్యూఢిల్లీ, అక్టోబర్ 6: మలేరియాకు టీకా వచ్చేసింది. ఇంగ్లండ్కు చెందిన ఫార్మా సంస్థ గ్లాక్సోస్మిత్ైక్లెన్ తయారు చేసిన వ్యాక్సిన్ RTS,S/AS01 లేదా RTS,SSకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ఆమోదం తెలిపింది. ‘RTS,SS టీకాను మలేరియా నివారణకు వాడవచ్చు’ అని డబ్ల్యూహెచ్వో బుధవారం సిఫారసు చేసింది. ఇది మలేరియాకు కారణం అయిన ప్లాస్మోడియం ఫాల్సిపారంను నిరోధిస్తుందని పేర్కొన్నది. మలేరియా నివారణకు డబ్ల్యూహెచ్వో అనుమతి పొందిన మొట్టమొదటి టీకా ఇదే. ఘనా, కెన్యా, మాలావీలో రెండేండ్లుగా 8 లక్షల మంది పిల్లలపై జరిగిన ట్రయల్స్/పైలట్ ప్రాజెక్టు ఆధారంగా టీకాకు అనుమతి లభించింది. ఇది నాలుగు డోసుల వ్యాక్సిన్. ఐదు నెలల వయసులో తొలి డోసు వేస్తారు. ‘మలేరియా టీకాకు అనుమతి లభించడం చరిత్రాత్మకం. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వ్యాక్సిన్ వచ్చేసింది. ఏటా లక్షల మంది పిల్లలను కాపాడవచ్చు’ అని డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ అధనోమ్ సంతోషం వ్యక్తం చేశారు.
ఏటా 2.6 లక్షల మంది బలి
ఆఫ్రికా ఖండం సహా అనేక దేశాల్లో మలేరియా ఏటా లక్షల మంది పసిపిల్లల ప్రాణాలను బలిగొంటున్నది. ఒక్క ఆఫ్రికాలోనే ఏటా 5 ఏండ్ల లోపు వయసున్న 2.6 లక్షల మంది పిల్లలు మలేరియాతో చనిపోతున్నారు. క్లినికల్ ట్రయల్స్లో టీకా సమర్థత మొదటి ఏడాదిలో 50శాతంగా వెల్లడైంది. సంవత్సరాలు గడిచినకొద్దీ తగ్గింది. అయితే, 5 ఏండ్లలోపు వయసున్న పిల్లలకు అంచెలవారీగా డోసులు ఇవ్వడం ద్వారా మరణాలు తగ్గించవచ్చని డబ్ల్యూహెచ్వో అభిప్రాయపడింది. ఇండియాలో ఏటా సగటున 3 లక్షల మలేరియా కేసులు నమోదు అవుతున్నాయి.