న్యూఢిల్లీ: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద బాధిత కుటుంబాలకు జీతంలో కొంత భాగాన్ని ఇవ్వాలని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ (Varun Gandhi) కోరారు. ఈ మేరకు తోటి ఎంపీలకు పిలుపునిచ్చారు. బాధిత కుటుంబాలను మొదట ఆదుకోవాలని, ఆపై వారికి న్యాయం చేయాలని అన్నారు. ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ నియోజకవర్గం ఎంపీ అయిన వరుణ్ గాంధీ ఈ మేరకు హిందీలో ట్వీట్ చేశారు. ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం హృదయ విదారకరమని అన్నారు. ‘దుఃఖంలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవాలి. మన జీతంలో కొంత భాగాన్ని వారికి అందించడం ద్వారా ఆ కుటుంబాలను ఆదుకోవాలని నా తోటి ఎంపీలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. వారికి ముందు మద్దతు ఇవ్వాలి, ఆపై న్యాయం జరుగాలి’ అని అందులో పేర్కొన్నారు.
కాగా, ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో శుక్రవారం సాయంత్రం మూడు రైళ్లు ఢీకొన్నాయి. లూప్ లైన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఢీకొన్నది. దాని కంపార్ట్మెంట్లు మెయిన్ లైన్పై పడ్డాయి. అయితే కొన్ని నిమిషాల్లోనే మెయిన్ లైన్లో వస్తున్న యశ్వంత్పూర్- హౌరా ఎక్స్ప్రెస్, ఆ పట్టాలపై పడిన కోరమాండల్ ఎక్స్ప్రెస్ బోగీలను ఢీకొట్టి పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య సుమారు 300కు చేరగా, వెయ్యి మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు.
మరోవైపు మూడు రైళ్ల ప్రమాదంపై విచారణకు ఉన్నతస్థాయి కమిటీని నియమించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అలాగే ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.50,000 చొప్పున పరిహారం ప్రకటించారు.
उड़ीसा की रेल दुर्घटना हृदय विदारक है!
जो परिवार इस हादसे से टूटे हैं हमें उनके साथ चट्टान की तरह खड़ा होना होगा।
मेरा सभी साथी सांसदों से निवेदन है कि हम सभी अपनी तनख्वाह का एक हिस्सा शोक संतप्त परिजनों के नाम कर उनकी मदद के लिए आगे आयें।
पहले उन्हें सहारा मिले, फिर न्याय।
— Varun Gandhi (@varungandhi80) June 3, 2023