పట్నా: బీహార్లోని ముజఫర్పూర్లో ముస్లిం విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ముజఫర్పూర్లోని ఓ మహిళా కాలేజీలో ఇంటర్ సెంట్-అప్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. పరీక్ష రాసేందుకు విద్యార్థినులను ఉపాధ్యాయుడు హిజాబ్ (Hijab) తీయాలని కోరాడు. హెడ్ స్కార్వ్ తీస్తేనే పరీక్ష రాయడానికి అనుమతిస్తానని చెప్పాడు. దానికి నిరాకరించిన వారు.. తమపట్ల ఉపాధ్యాయుడు అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ కాలేజీ ముందు ఆందోళనకు దిగారు. పోలీసుల జోక్యంతో శాంతించిన విద్యార్థినులు.. ఆందోళన విరమించి పరీక్ష రాశాసి వెళ్లిపోయారు.
ముజఫర్పూర్లోని మహంత్ దర్షన్ దాస్ మహిళా (MDDM) కాలేజీలో ఆదివారం ఇంటర్మీడియట్ సెంట్ అప్ పరీక్షలు నిర్వహించారు. పరీక్ష రాసేందుకు కొంతమంది ముస్లిం విద్యార్థినులు వచ్చారు. అయితే తరగతి వద్ద రవి భూషణ్ అనే ఉపాధ్యాయుడు.. బ్లూటూత్ వంటి పరికరాలు ఉంటాయనే అనుమానంతో వారిని హిజాబ్ తీసేయాలని కోరాడు. దీనికి వారు తిరస్కరించారు. ఎవరైనా మహిళా ఉద్యోగులు ఉంటే.. వారితో తమను తనిఖీ చేయించాలన్నారు. ఈ సందర్భంగా ఎవరివద్దనైనా బ్లూటూత్ దొరికితే వారిని పరీక్ష రాయడానికి అనుమతించవద్దన్నారు. అయితే హెడ్ స్కార్వ్ తీసేస్తేనే పరీక్ష రాయడానికి అనుమతిస్తానని ఆ ఉపాధ్యాయుడు చెప్పడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ పట్ల ఉపాధ్యాయుడు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడని.. ఇక్కడ ఉంటున్న మీరు.. అక్కడి పాట పాడుతారని, పాకిస్థాన్ వెళ్లిపోవాలన్నాడని ఆరోపిస్తూ కాలేజీ ఎందుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు కాలేజీ వద్దకు చేరుకుని వారిని శాంతిపజేశారు. పరీక్ష రాసిన అనంతరం ఇంటికి వెళ్లిపోయారు.
కాగా, ఈ వివాదంపై కాలేజీ ప్రిన్సిపాల్ స్పందించారు. ఆందోళనతో కాలేజీలో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించారని ఆందోళన వ్యక్తం చేశారు. మొబైల్ ఫోన్లు, బ్లూ టూత్ వంటి పరికరాలు పెట్టుకునే అవకాశం ఉండటంతోనే హెడ్ స్కార్వ్ తొలగించాలని తమ సిబ్బంది కోరారని చెప్పారు. దానిని వారు మతానికి ముడిపెట్టి విషయాన్ని వివాదంగా మార్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు.