లక్నో: స్కూల్ విహార యాత్రలో విద్యార్థినికి మత్తుమందు ఇచ్చిన ప్రిన్సిపాల్ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధిత బాలిక తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ప్రిన్సిపాల్ కోసం వెతుకుతున్నారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక ప్రభుత్వ స్కూల్కు చెందిన ప్రిన్సిపాల్ నవంబర్ 23న 11వ తరగతి చదివే 9 మంది విద్యార్థులను విహార యాత్ర కోసం బృందావనం తీసుకెళ్లాడు. ఆ రాత్రి అక్కడ బస కోసం హోటల్లో రెండు గదులు బుక్ చేశాడు.
ఒక రూమ్లో 8 మంది విద్యార్థులు ఉండగా, 17 ఏళ్ల బాలికతో కలిసి మరో గదిలో ప్రిన్సిపాల్ బస చేశాడు. ఆమె తినే ఆహారంలో మత్తుమందు కలిపాడు. మత్తులో ఉన్న ఆ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే పరీక్షలో ఫెయిల్ చేస్తానని, చంపుతానని బెదిరించాడు. ఆ మరునాడు విద్యార్థులు తమ ఇళ్లకు తిరిగివచ్చారు.
కాగా, బాధిత బాలిక భయంతో తొలుత దీని గురించి ఎవరికీ చెప్పలేదు. ఆ తర్వాత ప్రిన్సిపాల్ లైంగిక దాడి గురించి తన కుటుంబానికి తెలిపింది. ఈ నేపథ్యంలో విద్యార్థిని తండ్రి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. పరారీలో ఉన్న ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపాల్ కోసం వెతుకుతున్నట్లు వెల్లడించారు.