లక్నో: వెంటపడి వేధిస్తున్న వ్యక్తి చెంపపై ఒక బాలిక కొట్టింది. ఆమెను కిడ్నాప్ చేసిన అతడు బిల్డింగ్ నాలుగో అంతస్తు నుంచి కిందకు తోశాడు. తీవ్రంగా గాయపడిన ఆ బాలిక చికిత్స పొందుతూ మరణించింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. (Man Push Girl From 4th Floor) ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కౌశాంబి ప్రాంతంలోని భావపూర్లో నివసించే 15 ఏళ్ల ఖుషీని అదే ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల షానావాజ్ వెంటపడి వేధించినట్లు ఆమె కుటుంబం ఆరోపించింది. ఈ నేపథ్యంలో అతడి చెంపపై ఆమె కొట్టిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
కాగా, జూలై 15న రాత్రి 10 గంటల సమయంలో పాల ప్యాకెట్ కొనేందుకు ఖుషి తన ఇంటి నుంచి బయటకు వచ్చింది. సమీపంలోని షాపునకు వెళ్లింది. ఆ బాలికను గమనించిన షానావాజ్ ఆమెను కిడ్నాప్ చేశాడని, బిల్డింగ్ నాలుగో అంతస్తుకు తీసుకెళ్లి అక్కడి నుంచి కిందకు తోసేసినట్లు ఆమె కుటుంబం ఆరోపించింది.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన బాలికను ఢిల్లీలోని జీటీబీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఈ నేపథ్యంలో మృతురాలి తల్లి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. షానావాజ్ను అరెస్ట్ చేశారు.
అయితే పోలీసుల విచారణలో ఈ ఆరోపణలను నిందితుడు ఖండించాడు. ఆ అమ్మాయిని తాను తోయలేదని షానావాజ్ చెప్పాడు. తాను గ్రౌండ్ ఫ్లోర్లో ఉండగా, ఆ బాలిక నాలుగో అంతస్తుకు వెళ్లినట్లు తెలిపాడు. కూల్డ్రింక్ కొనివ్వమని అక్కడి నుంచి తనను పిలిచిందని, అయితే ఉన్నట్టుండి జారి కిందపడిందని పోలీసులకు చెప్పాడు. ఈ నేపథ్యంలో ఈ కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.