New Delhi : దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. ఇంటికి లేటుగా రావడంతో పేరెంట్స్ తిట్టినందుకు ఒక బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఢిల్లీలోని షహ్దారా ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలివి. బిహార్లోని మధుబని జిల్లాకు చెందిన ఒక బాలిక (13) తన కుటుంబంతో కలిసి ఢిల్లీలోని షహ్దారా ప్రాంతంలోని ఇంట్లో నివసిస్తోంది.
రాత్రి ఇంటికి లేటుగా వచ్చింది. దీంతో బాలికను కుటుంబ సభ్యులు తిట్టారు. మనస్థాపానికి గురైన బాలిక వేరే గదిలోకి వెళ్లి, చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొద్దిసేపటి తర్వాత బాలిక సోదరి వెళ్లి చూడగా, అప్పటికే ఉరివేసుకుని కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు బాలికను కిందికి దించి, వెంటనే దగ్గర్లోని డా.హెగ్గేవార్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె మృతిచెందినట్లు వెల్లడించారు.
ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకుని, విచారణ చేపట్టారు. బాలిక మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.