న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వం కంటే మహారాజా హరి సింగ్ నిరంకుశ పాలనే నయమనిపిస్తోందని వ్యాఖ్యనించారు. జమ్ము, శ్రీనగర్ల మధ్య సంప్రదాయంగా ప్రతి ఆరునెలలకు ఒకసారి జరిగే ప్రభుత్వ కార్యాలయాల మార్పును అధికారులు నిలిపివేయడం పట్ల ఆజాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
1872లో మహారాజ గులాబ్ సింగ్ దర్బార్ బదలాయింపుపై ఈ ఏర్పాట్లు చేశారని ఆయన గుర్తుచేశారు. నియంతలా పేరొందిన మహారాజా హరి సింగ్ హయాం ప్రస్తుత సర్కార్ కంటే మెరుగైదనిగా కనిపిస్తోందని అన్నారు. ప్రజల భూములు, ఉద్యోగాలను కాపాడటంలో హరిసింగ్ చొరవ చూపారని అన్నారు.
ఆర్టికల్ 370 రద్దును ఆజాద్ ప్రస్తావిస్తూ మహారాజ ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తే ప్రస్తుత ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాస్తోందని దర్బార్ తరలింపు నిలిపివేయడంతో పాటు ప్రజల నుంచి వారి భూములు, ఉద్యోగాలను లాగేస్తోందని ఆజాద్ మండిపడ్డారు.