న్యూఢిల్లీ : దేశీయ తొలి ఎంఆర్ఎన్ఏ (mRNA) జెమ్కోవాక్-19 వ్యాక్సిన్కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చింది. పుణేకు చెందిన జెన్నోవా బయో ఫార్మాస్యూటికల్స్ కరోనా మహమ్మారికి దేశీయంగా టీకాను అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సిన్ 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు వారికి ఇవ్వనున్నారు. రెండు డోసుల టీకాను 28 రోజుల వ్యవధిలో ఇంట్రామస్కులర్ విధానంలో వేయనున్నారు. కంపెనీ వ్యాక్సిన్ను జెమ్కోవాక్-19 పేరుతో విక్రయించనున్నది.
ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన జెన్నోవా బయోఫార్మాస్యూటికల్స్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ అత్యవసర వినియోగ అనుమతి (EUA) ఇచ్చిందని బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. జెమ్కోవాక్-19 భారత్లో అభివృద్ధి చేసిన మొదటి ఎంఆర్ఎన్ఏ (mRNA) వ్యాక్సిన్. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కోసం ఆమోదించిన మూడో ఎంఆర్ఎన్ఏ టీకా ఇది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) టీకా క్లినికల్ ట్రయల్స్ డేటాను పరిశీలించిన అనంతరం అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చిందని కంపెనీ పేర్కొంది.
వ్యాక్సిన్ సురక్షితమైందని, వైరస్ నుంచి రోగ నిరోధక శక్తిని అందిస్తుందని తెలిపింది. ఈ వ్యాక్సిన్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. రెండు నుంచి 8 డిగ్రీల సెల్సియస్ మధ్య కూడా ఈ వ్యాక్సిన్ను స్టోరేజ్ చేయొచ్చు. సాధారణంగా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లను.. అత్యంత లో-టెంపరేచర్లలో (సున్నా అంతకంటే తక్కువ) భద్రపరిచి.. సరఫరా చేస్తారు. అలాంటి ఆటంకాలేవీ లేవని ఈ టీకాకు ఉండవని కంపెనీ పేర్కొంది. ఇదిలా ఉండగా.. నెలకు దాదాపు 40-50 లక్షల డోసులను ఉత్పత్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నది.