న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: జన్యు మార్పిడి చేసిన ఊదా రంగు టమాటాల పెంపకానికి అమెరికా ఆమోదం తెలిపింది. 2008లో యూరోపియన్ పరిశోధకులు డ్రాగన్ పుష్పాల జీన్స్ను టమాటాలో ప్రవేశపెట్టి వీటిని సృష్టించారు. వీటిలో క్యాన్సర్ వ్యాధిని నిరోధించే ఆంతోసయానిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ టమాటాలు చూడగానే నల్ల వంకాయల్లా కనిపిస్తాయి. ఇటలీ, జర్మనీ, నెదర్లాండ్స్ పరిశోధకులు సృష్టించిన ఈ జన్యుమార్పిడి (జీఎంవో) పంటను తమ దేశంలో పండించేందుకు మొదట అమెరికా వ్యవసాయ శాఖ ఒప్పుకోలేదు. 14 ఏండ్ల తర్వాత ఎట్టకేలకు అంగీకరించింది. వచ్చే ఏడాది నుంచి ఈ పంటను అమెరికాలో పండించవచ్చని ఆ దేశ వ్యవసాయ శాఖ శనివారం ప్రకటించింది.