న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే రచించిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం అసలు ముద్రణకే వెళ్లలేదని ప్రచురణ సంస్థ పెంగ్విన్ రాండమ్ హౌస్ ఆఫ్ ఇండియా మంగళవారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. కాగా, ఈ పుస్తకం ప్రచురణకే వెళ్లలేదని, ప్రింట్ లేదా డిజిటల్ రూపంలో ఎటువంటి ప్రతులు ప్రచురించడం, పంపిణీ చేయడం, విక్రయించడం లేదా మరే రూపంలో కూడా ప్రజలకు ఈ పుస్తకాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరగలేదని ప్రచురణ సంస్థ ప్రకటించింది.
ఈ ప్రకటన వెలువడడానికి కొన్ని గంటల ముందే సోమవారం రాత్రి ఢిల్లీ పోలీసులు జనరల్ నరవణే అముద్రిత పుస్తకం ఆన్లైన్లో సర్క్యులేట్ కావడంపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, పెంగ్విన్ రాండమ్హౌస్ ప్రకటనపై వ్యాఖ్యానించవలసిందిగా మంగళవారం రాహుల్ గాంధీని విలేకరులు కోరినపుడు తాను పబ్లిషర్ కన్నా జనరల్ నరవణేనే నమ్ముతున్నానని చెప్పారు.
తన పుస్తకంపై నెలకొన్న వివాదంపై నరవణే మంగళవారం మౌనం వీడారు. గత వారం రోజులకు పైగా ఈ పుస్తకంపై అధికార, ప్రతిపక్షం మధ్య పార్లమెంట్లో తీవ్ర స్థాయిలో వాగ్వాదం నెలకొన్న నేపథ్యంలో ఎటువంటి వ్యాఖ్యలు చేయని నరవణే మొదటిసారి స్పందించారు. ఈ పుస్తకాన్ని అసలు ప్రచురించ లేదని, అధికారిక ప్రతులు ఏవీ ఎక్కడా ఉండే అవకాశమే లేదని ప్రచురణ సంస్థ పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా సోమవారం విడుదల చేసిన ప్రకటనను ధృవీకరిస్తూ దాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్లో షేర్ చేశారు.
ఇదీ ప్రస్తుత పరిస్థితి అన్న అర్థంతో ఆంగ్లంలో ట్వీట్ చేస్తూ పుస్తకం ఇంకా అముదిత్రమేనని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు. మరోవైపు ఆమోదం పొందని నరవణే పుస్తకం ప్రీ-ప్రింట్ పీడీఎఫ్ ఆన్లైన్లో సర్కులేట్ అవుతున్నది.