Dhiraj Seth : ఇండియన్ ఆర్మీ (Indian Army) 31వ అధిపతిగా జనరల్ ధీరజ్ సేథ్ (General Dhiraj Seth) బుధవారం బాధ్యతలు చేపట్టారు. పదవీ విరమణ చేసిన జనరల్ ఉపేంద్ర ద్వివేది (General Upendra Dwivedi) స్థానంలో ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు. ఈ నియామకంపట్ల ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ.. విధి, గౌరవం, దేశమే ప్రథమం అనే ఆదర్శాలకు కట్టుబడి సైన్యాన్ని నడిపిస్తానని స్పష్టంచేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన జాతీయ యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులు అర్పించారు.
అనంతరం సౌత్ బ్లాక్లో సేథ్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా తన తండ్రి, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కేఎం సేథ్కు ఆయన సెల్యూట్ చేయడం, ఆయన సోదరుడు రియర్ అడ్మిరల్ రవ్నీశ్ సేథ్ ఆయనకు సెల్యూట్ చేయడం ప్రత్యేకత సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా జనరల్ సేథ్ మాట్లాడుతూ.. ‘విజయ్’ అనే నినాదంతో తన ప్రాధాన్యతలను నిర్దేశించుకున్నట్లు తెలిపారు. సరిహద్దుల్లో నిరంతర నిఘా, వినూత్న ఆవిష్కరణలు, వైమానిక-నౌకాదళాలతో సమన్వయం, ఆత్మనిర్భరత, సైనికుల సంక్షేమానికి అగ్ర ప్రాధాన్యం అనే ఐదు అంశాలే తన లక్ష్యాలని వివరించారు.
భారత సైన్యానికి నాయకత్వం వహించే గౌరవం, బాధ్యతను అప్పగించినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లకు సేథ్ కృతజ్ఞతలు తెలిపారు. దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ సాయుధ బలగాల కోసం ఇచ్చిన ‘జై’ (JAI – జాయింట్నెస్, ఆత్మనిర్భరత, ఇన్నోవేషన్) మంత్రమే తన ‘విజయ్’ ప్రాధాన్యతలకు పునాది అని, ఇది తమను విజయంవైపు నడిపిస్తుందని జనరల్ సేథ్ చెప్పారు.