జైపూర్ : రాజస్ధాన్లో శాంతి భద్రతల పరిస్ధితి దిగజారిందని బీజేపీ విమర్శలపై సీఎం అశోక్ గెహ్లోత్ స్పందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్ధితిని పర్యవేక్షించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోసం తాను చార్టర్డ్ విమానాన్ని పంపుతానని గెహ్లోత్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జొహరి లాల్ మీనా కుమారుడిపై లైంగిక దాడి కేసు నమోదైన అనంతరం కాషాయ పార్టీ, కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధం ముదిరింది.
గ్యాంగ్ రేప్ ఘటన నేపధ్యంలో శాంతిభద్రతల పరిస్ధితిని పరిశీలించేందుకు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి రాజస్ధాన్ బీజేపీ కార్యదర్శి జితేంద్ర గొత్వాల్ రైలు టికెట్ పంపారు. కాగా 15 ఏండ్ల బాలికపై సామూహిక లైంగిక దాడి ఘటనలో మీనా కుమారుడితో పాటు నలుగురిపై కేసు నమోదైంది. తన కుమారుడిపై లైంగిక దాడి ఆరోపణలు నిరాధారమైనవని కాంగ్రెస్ ఎమ్మెల్యే మీనా తోసిపుచ్చారు.
పోలీసులు తన కుమారుడిని ప్రశ్నించవచ్చని అయితే అతడు దోషిగా తేలబోడని ధీమా వ్యక్తం చేశారు. ఇక దళితులపై వేధింపులు తీవ్రతరమయ్యాయని, దళితులపై దమనకాండను చూసేందుకు రాజస్ధాన్ సందర్శించాలని కోరుతూ 2021 అక్టోబర్లో మధ్యప్రదేశ్ బీజేపీ నేతలు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు విమాన టికెట్లు పంపడం హాట్ టాపిక్గా మారింది.