Assam CM : లోక్సభ (Lok Sabha) లో కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగొయ్ (Gaurav Gogoi) పై అస్సాం సీఎం (Assam CM) హిమంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) తీవ్ర విమర్శలు చేశారు. గొగోయ్కి, ఆయన భార్యకు పాకిస్థానీ ఏజెంట్ అలీ తౌఖీర్ షేక్ (Ali Tauqueer Sheik) తో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఆ ఏజెంట్ 2010-13 మధ్యకాలంలో 13 సార్లు భారత్కు వచ్చాడని, ప్రపంచవ్యాప్తంగా అతడు భారత వ్యతిరేక ప్రచారం చేశాడని పేర్కొన్నారు. గువాహటిలో నిర్వహించిన మీడియా సమావేశంలో హిమాంత ఈ వ్యాఖ్యలు చేశారు.
‘పాకిస్థానీ ఏజెంట్ అలీతో గౌరవ్ గొగొయ్కి, ఆయన సతీమణి, బ్రిటన్ పౌరురాలైన ఎలిజబెత్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఓ పాక్ సంస్థ ఆమెకు ఉద్యోగం ఇచ్చి, ఆ తర్వాత భారత్కు బదిలీ చేసింది. ఆమె జీతాన్ని అలీ చెల్లించాడు. అనంతరం ఆమె ఓ భారత సంస్థలో పనిచేస్తున్నప్పుడు.. ఆరుసార్లు ఇస్లామాబాద్కు వెళ్లారు. మరో స్వచ్ఛంద సంస్థలో చేరిన తర్వాత మూడుసార్లు పాకిస్థాన్ను సందర్శించారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు అటారీ సరిహద్దు మీదుగా మాత్రమే వెళ్లేవారు. ఎప్పుడూ విమానం ఎక్కలేదు’ అని హిమాంత అన్నారు.
‘ఎలిజబెత్కు చెల్లింపుల విషయంలో ఎఫ్సీఆర్ఏ నిబంధనల ఉల్లంఘన జరిగింది. భారత్కు సంబంధించిన సమాచారాన్ని ఆమె సేకరించి అలీకి నివేదికలు ఇచ్చేవారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాతావరణ చర్యలకు సంబంధించి ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారాన్ని సేకరించారు. మరోవైపు తన భార్యకు సంబంధించిన పాకిస్థానీ బ్యాంకు ఖాతా వివరాలను గొగొయ్ ఎన్నికల అఫిడవిట్లో ప్రస్తావించలేదు. గొగొయ్ సైతం తన వివాహానికి ముందు 2013లో రహస్యంగా పాకిస్థాన్ వెళ్లారు. ఆ సమయంలో ఆయన అస్సాం అప్పటి సీఎం నివాసంలో ఉండేవారు. లాహోర్కు మాత్రమే వెళ్లేందుకు వీసా జారీ అయినప్పటికీ.. ఇస్లామాబాద్, కరాచీ సందర్శించారు’ అని చెప్పారు.
‘ఈ పర్యటన గురించి అస్సాం పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. తాను బస చేసిన 10 రోజులపాటు డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉన్నారు. అక్కడ ఆయనకు ఏదో రకమైన శిక్షణ ఇచ్చారని అనుమానిస్తున్నాం. ఆ పర్యటన తర్వాత ఆయన పార్లమెంట్లో రక్షణ పరికరాలు, అణు విద్యుత్ ప్లాంట్లపై ప్రశ్నలు అడిగారు. ఈ వ్యవహారంపై అస్సాం ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించిన తర్వాత.. పాక్ ఏజెంట్ తన అన్ని ట్వీట్లను డిలీట్ చేశాడు. గౌరవ్, ఆయన సతీమణికి ఆ ఏజెంట్తో సంబంధం ఉందని విశ్వసిస్తున్నాం. పొరుగు దేశంతో సంబంధాల విషయమై గొగొయ్ను మేం ఇప్పటివరకు విచారించలేదు. ఆయన పదవికి గౌరవం ఇస్తూ.. ఆ విషయాన్ని కేంద్రానికే వదిలిపెట్టాం. ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తునకు సిఫార్సు చేస్తున్నాం’ అన్నారు.
కాగా హిమాంత ఆరోపణలను ఎంపీ గౌరవ్ గొగొయ్ తీవ్రంగా ఖండించారు. సీఎం మీడియా సమావేశాన్ని ‘సూపర్ ఫ్లాప్’గా పేర్కొన్నారు. రాజకీయ చతురత ఉందని చెప్పుకొనే ఆయన.. అన్నీ అర్థం లేని, నిరాధార ఆరోపణలే చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు ఆక్రమించుకున్న భూముల వ్యవహారాన్ని బయటపెట్టడంలో మేం చేపట్టిన యాత్ర విజయవంతమైందని చెప్పారు. దీనికి విరుద్ధంగా ఆయన మీడియా సమావేశం విఫలమైందని గొగొయ్ ట్వీట్ చేశారు.