గౌహతి: కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా(Pawan Khera)కు గౌహతి హైకోర్టులో కూడా చుక్కెదురైంది. ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు గౌహతి హైకోర్టు నిరాకరించింది. అస్సాం క్రైం బ్రాంచ్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ భార్య రినికి భుయాన్ శర్మకు పలు దేశాల్లో పాస్పోర్టులు ఉన్నాయని, ఆమెకు విదేశాల్లో ఆస్తులు ఉన్నట్లు ఓ మీడియా సమావేశంలో పవన్ ఖేరా ఆరోపించారు. ఆ ఆరోపణల నేపథ్యంలో ఖేరాపై గౌహతిలో కేసు నమోదు అయ్యింది.
అయితే ఏప్రిల్ 21వ తేదీన గౌహతి హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ జస్టిస్ పార్తివ్జ్యోతి సైకియా తన తీర్పును వెల్లడించారు. ముందస్తు బెయిల్ను తిరస్కరిస్తున్నట్లు కోర్టు పేర్కొన్నది.ఏప్రిల్ 7వ తేదీన ఢిల్లీలోని ఖేరా ఇంటికి అస్సాం పోలీసులు వెళ్లారు. అయితే ఖేరా ముందస్తు బెయిల్ కోసం తొలుత తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టుకు ఆయనకు వారం రోజుల రిలీఫ్ ఇచ్చింది. కానీ ఆ కోర్టు తీర్పుపై ఏప్రిల్ 15వ తేదీన సుప్రీం స్టే ఇచ్చిన విషయం తెలిసిందే.