Mumbai–Pune Expressway : ఎక్కడైనా ట్రాఫిక్ వల్ల రహదారిపై ఒకట్రెండు గంటలు వాహనాలు నిలిచిపోతాయి. అది కూడా నగరాల్లోనే. సిటీ అవతల.. అందులోనూ నేషనల్ హైవేలపై ట్రాఫిక్ జామ్ అనేదే చాలా అరుదు. కానీ, ముంబై-పూనే ఎక్స్ప్రెస్ హైవేపై ట్రాఫిక్ 27 గంటలు ఆగిపోయింది. మంగళవారం సాయత్రం ఐదున్నర గంటల నుంచి బుధవారం అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది.
పెద్ద, చిన్న వాహనాలు అన్నీ ఒక రోజుకుపైగా ట్రాఫిక్లో ఇరుక్కుపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆహారం, నీరు వంటి వసతుల కోసం పడరాని పాట్లు పడ్డారు. ఒక ప్రమాదకర ఆయిల్ ట్యాంకర్ హైవేపై బోల్తా పడటం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. అధికారులు, సహాయక సిబ్బంది అక్కడికి చేరుకున్నప్పటికీ వెంటనే ట్రాఫిక్ క్లియర్ చేయడం సాధ్యం కాలేదు. కారణం.. ఆ ట్యాంకర్లో ఉన్నది ప్రమాదకర రసాయనం. వాహనాన్ని తొలగించేటప్పుడు ఏమాత్రం ప్రమాదం జరిగినా బ్లాస్ట్ కావడం ఖాయం. దీని ప్రభావం చాలా దూరం ఉంటుంది. అందువల్ల నిపుణులు నెమ్మదిగా గ్యాస్ తొలగిస్తూ వచ్చారు. దీనికి ఒకరోజు పైనే పట్టింది. సరే.. ఇందులో ఎవరినీ తప్పుబట్టడానికి లేదు. అసలు సమస్య ట్రాఫిక్.
రోడ్డుపై ట్యాంకర్ బోల్తా పడింది కాబట్టి అక్కడ వాహనాలు నిలిచిపోయాయి అనుకోవచ్చు. అది కూడా ఓకే. కానీ, ఎంతసేపు. అరగంట.. గంట. కానీ, 27 గంటలు ట్రాఫిక్ ఆగిపోయి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారంటే అక్కడి పరిస్తితి అర్థం చేసుకోవచ్చు. అదీ హైవేపై. దీనంతటికీ కారణం.. ట్యాంకర్ బోల్తా పడటం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయాన్ని చూపించలేని అధికారులదే తప్పు అని ప్రజలు అంటున్నారు. అధికారులు రెండో దారిని ఎందుకు ఏర్పాటు చేయలేదు. మరోమార్గంలో ట్రాఫిక్ మళ్లిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి దగ్గర నుంచి తాత్కాలిక దారిని ఏర్పాటు చేసినా ఇంత ట్రాఫిక్ సమస్య ఉండేది కాదని అందులో ఇరుక్కున్న వాళ్లు అంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో ఇంకా మనం నేర్చుకోలేదు అనేందుకు ఈ ఘటన ఒక నిదర్శనంగా నెటిజన్లు చెబుతున్నారు.
మరోవైపు హైవేలపక్కన హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యేందుకు హెలిప్యాడ్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. హైవేలపై వేర్వేరు చోట్ల ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేయాలని ఇంకొందరు అంటున్నారు. ప్రభుత్వ అసమర్ధత వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ప్రజలు విమర్శిస్తున్నారు.