Jail Photoes : తీహార్ జైలులో ఉంటున్న పేరు మోసిన గ్యాంగ్స్టర్ నవీన్ బాలి తన మొబైల్ ఫోన్ ద్వారా జైలు ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. తన ఇన్ స్టా ఖాతా నుంచి పలుమార్లు జైలుకు సంబంధించిన ఫోటోలను ఇంటర్నెట్లో అప్లోడ్ చేశాడు. ఈ విషయాన్ని తెలుపుతూ హర్యానా ఇంటెలిజెన్స్ విభాగం.. తీహార్ జైలు డైరెక్టర్ జనరల్కు, ఢిల్లీ పోలీస్ కమిషనర్కు లేఖలు పంపింది.
దాంతో ఈ ఘటనపై విచారణ జరపాలని స్పెషల్ సెల్ పోలీసులకు, క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. జైలులో ఉన్న నవీన్ బాలిపై హత్య, దోపిడీ, హత్యాయత్నం తదితర కేసులు ఉన్నాయి. అతను నీరజ్ బవానా గ్యాంగ్లో ముఖ్యమైన సభ్యుడు. చాలా ఘటనల్లో అతను నీరజ్కి అసోసియేట్గా ఉన్నాడు. 2021లో రోహిణి కోర్టులో జితేంద్ర గోగిని హత్య చేసిన కేసులో కూడా నవీన్ బాలీ నిందితుడిగా ఉన్నాడు.
అయితే హర్యానా పోలీసులు ఈ మధ్య నేరస్థుల సోషల్ మీడియా ఖాతాలను స్కాన్ చేస్తున్నారు. ఈ సమయంలో నవీన్ బాలి ఇన్స్టాగ్రామ్ ఖాతాలో జైలు చిత్రాలను పోస్ట్ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి హర్యానా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ అశోక్ మిట్టల్.. తీహార్ జైలు డైరెక్టర్ జనరల్ సతీష్ గోల్చా, ఢిల్లీ పోలీస్ కమిషనర్కు లేఖ రాశారు. మే, జూన్లో మూడు సార్లు ఫొటోలు అప్లోడ్ చేసినట్లు లేఖలో పేర్కొన్నారు.
చివరిసారిగా జూలై 8న బాలీ ఇన్స్టాగ్రామ్లో జైలు ఫొటోను అప్లోడ్ చేశాడు. ఢిల్లీ-ఎన్సీఆర్లోని చాలామంది నేరస్థులు తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారు. అయితే వాటిని జైలు నుంచి కాకుండా బయట ఉన్న వారి అనుచరులు పోస్ట్ చేస్తారు. కోర్టులో హాజరుపరిచే సమయంలో వారి వీడియోలను తీసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెడుతారు. కానీ నవీన్ బాలి పెడుతున్న ఫొటోలు జైలు నుంచి అప్లోడ్ అవుతున్నాయి.