న్యూఢిల్లీ: రాజకీయవేత్తగా మారిన గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీ(Mukhtar Ansari)కి పదేళ్ల జైలుశిక్ష పడింది. కిడ్నాప్, మర్డర్ కేసులో ఆయనకు ఈ శిక్షను ఘాజిపూర్ కోర్టు ఖరారు చేసింది. గ్యాంగ్స్టర్ చట్టం ప్రకారం అన్సారీపై కేసు వేశారు. 5 లక్షల జరిమానా కూడా చెల్లించాలని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఆదేశించింది. ముక్తార్ అన్సారీతో పాటు బీఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీపై కిడ్నాప్, మర్డర్ కేసులు ఉన్నాయి. తీర్పు సందర్భంగా కోర్టు వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
ముక్తార్ అన్సారీ అయిదుసార్లు ఎమ్మెల్యేగా చేశారు. విశ్వహిందూ పరిషత్ నేత నందకిశోర్ రుంగ్తాను 1996లో కిడ్నాప్ చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఇక 2005లో బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద రాయ్ను మర్డర్ చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. 2001లో జరిగిన ఉర్సీ చట్టి గ్యాంగ్వార్లో అన్సారీపై మర్డర్ కేసు నమోదు అయ్యింది. ఐపీసీ 302, 147, 148, 149 సెక్షన్ల కింద ఆ కేసు ఫైల్ చేశారు.