న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఒకప్పటి అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్కు కరోనా వైరస్ సోకిన విషయం విదితమే. అయితే రాజన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో.. ఆయనను జైలు నుంచి ఢిల్లీ ఎయిమ్స్కు తరలించినట్లు ముంబై సెషన్స్ కోర్టుకు సోమవారం అధికారులు తెలిపారు. చోటా రాజన్ ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నాడని, జైలులోని ఆస్పత్రిలో అతనికి చికిత్స అందిస్తున్నామని ఇటీవల అధికారులు పేర్కొన్న విషయం తెలిసిందే. కొవిడ్ సోకడంతో ప్రత్యేక వార్డులో సాయుధ పోలీసుల పర్యవేక్షణలో అతనికి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ముంబైలో దోపిడీ, హత్యలకు సంబంధించి 70 క్రిమినల్ కేసులను రాజన్ ఎదుర్కొంటున్నాడు. 2015లో రాజన్ అరెస్టు అయ్యారు. 2018లో జర్నలిస్ట్ జ్యోతిర్మయ్ డే హత్య కేసులో రాజన్ దోషిగా తేలాడు. దీంతో అతనికి జీవిత ఖైదు విధించారు. రాజన్ పై ఉన్న కేసులన్నింటినీ సీబీఐకి బదిలీ చేశారు. ఈ కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు.