ప్రయాగ్రాజ్, ఏప్రిల్ 15: యూపీలో మరో సంచలనం చోటుచేసుకున్నది. ఉమేశ్పాల్ హత్య కేసు నిందితుడు, గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ను గుర్తు తెలియని వ్యక్తులు శనివారం ప్రయాగ్రాజ్లో కాల్చిచంపారు. వైద్యపరీక్షల నిమిత్తం జైలు నుంచి తీసుకుని వెళ్తుండగా ఈ దారుణం జరిగింది. యూపీ పోలీసుల చేతిలో గురువారం ఎన్కౌంటర్లో హతమైన అతీక్ కుమారుడు అసద్ అంత్యక్రియలు ముగిసిన కొద్ది గంటల వ్యవధిలోనే అతడి తండ్రిని కూడా కాల్చిచంపడం సంచలనం రేపింది.
యూపీ పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, తన కుమారుడి అంత్యక్రియలకు అనుమతించాలంటూ జైలులో ఉన్న అతీక్ కోర్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. శుక్రవారం అంబేద్కర్ జయంతి కారణంగా సెలవు కావడంతో అతని దరఖాస్తును రిమాండ్ మెజిస్ట్రేట్కు పంపారు. ఆ దరఖాస్తు శనివారం చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్కు పంపకముందే అసద్ అంత్యక్రియలు ముగిశాయి.