Delhi murder case : ఢిల్లీలో జరిగిన ఐఆర్ఎస్ అధికారి కూతురు హత్య కేసు ఘటనలో నిందితుడు రాహుల్ మీనాను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఈ కేసు విచారణ సందర్భంగా రాహుల్ నుంచి సంచలన విషయాలు బయటపడుతున్నాయి. బుధవారం ఉదయం దక్షిణ ఢిల్లీలో ఉంటున్న ఐఆర్ఎస్ అధికారి కూతురుపై రాహుల్ మీనా హత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం వారి ఇంట్లోంచి నగదు, బంగారం కూడా దోచుకెళ్లాడు. ఈ నేరానికి పాల్పడటానికి ఒక రోజు ముందు కూడా రాహుల్ మీనా.. రాజస్థాన్లోని తన ఇంటి పక్కన ఉండే స్నేహితుడి భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బాధితురాలిని బెదిరించాడు. అనంతరం అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చి మరో దారుణానికి ఒడిగట్టాడు. నిందితుడు రాహుల్ మీనా పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు. అతడికి ఆన్లైన్ గేమింగ్ అలవాటు ఉండేది. అది వ్యసనంగా మారింది. అలాగే, మొత్తంగా రూ.5 లక్షల వరకు అప్పు ఉంది. ఈ నేపథ్యంలో అప్పు తీర్చేందుకు చివరికి తన కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా అమ్మేశాడు. అయితే, ఆ డబ్బుతో తిరిగి గేమ్స్ ఆడాడు. ఐఆర్ఎస్ ఇంట్లో రాహుల్ ఏడాదిన్నర కాలంపాటు పని చేశాడు. అప్పుడు అతడికి నెలకు రూ.20,000 వేతనం అందేది. అలాగే, గిఫ్టులు, పండుగల సందర్భంగా బోనస్లు వంటివి కూడా ఇచ్చేవారు. కానీ, అతడికి నెమ్మదిగా ఆన్లైన్ గేమ్స్ అలవాటయ్యాయి. ఆ తర్వాత వ్యసనంగా మారింది. చివరకు గేమ్స్ వల్ల అప్పులపాలయ్యాడు. తన అసవరాల కోసం షాపుల దగ్గరి నుంచి సరుకులు అప్పు తెచ్చుకునేవాడు. ఇది గుర్తించిన ఐఆర్ఎస్ ఆఫీసర్ అతడిని ఈ వ్యసనం గురించి హెచ్చరించాడు. అయినప్పటికీ అప్పులు చేయడం, గేమ్స్ ఆడటం వంటివి మానకపోవడంతో అతడిని పనిలోంచి తీసేశారు.
అప్పటికి అతడికి దాదాపు రూ.5 లక్షల అప్పైంది. ఈ కారణంతోనే అతడు తనకు పని కల్పించిన ఐఆర్ఎస్ ఇంటిని టార్గెట్ చేసుకున్నాడు. ఆ ఇంటిలోకి వెళ్లిన రాహుల్.. అత్యంత దారుణంగా నేరానికి పాల్పడ్డాడు. యువతిపై దాడి చేసి, ఆపై అత్యాచారం చేశాడు. ఆ ఇంట్లోని నగదు, డబ్బులు తీసుకున్న అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తర్వాత అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. అతడిని పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ కోర్టు నిర్ణయం తీసుకుంది.