Viral News | ఈ కాలం పిల్లలు స్మార్ట్ ఫోన్లతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. మారాం చేస్తున్నారనో లేదా అన్నం తినట్లేదన్న కారణంతోనో తల్లిదండ్రులు మొబైల్స్లో గేమ్స్ డౌన్లోడ్ చేసి మరీ వారికి ఇస్తున్నారు. దీంతో వారు ఎక్కువసేపు వాటితోనే గడిపేందుకు ఇష్టపడుతున్నారు. గేమ్స్ ఆడటం, వీడియోస్ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. పక్కన ఎవరున్నారన్నది కూడా పట్టించుకోవట్లేదు. చివరకు ఫోన్ను మాన్పిద్దామనుకున్న తల్లిదండ్రులకు నిరాశే మిగులుతోంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.
గ్రేటర్ నోయిడాకు చెందిన 15 ఏళ్ల బాలుడికి స్మార్ట్ ఫోన్లో గేమ్స్ ఆడటమంటే మహా ఇష్టం. సమయం దొరికినప్పుడల్లా ఫోన్కు అతుక్కుపోయి తనకు ఇష్టమైన గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేసేవాడు. అయితే, ఇటీవల ఫోన్ పాడైపోయింది. దాన్ని సరిచేపించమని తల్లిదండ్రులను కోరినా.. వారు పట్టించుకోలేదు. దాన్ని రిపేర్ చేయిస్తే మళ్లీ ఫోన్లోనే లీనమైపోతాడన్న భయంతో దాన్ని సరిచేయించేందుకు బాలుడి తండ్రి నిరాకరించాడు.
దీంతో మనస్థాపం చెందిన సదరు బాలుడు ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలుడి మృతికి సరైన కారణం తెలియదని.. ఫోన్ రిపేర్ చేయించలేదన్న కారణంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వారు తెలిపారు.