న్యూఢిల్లీ: ఇటీవల గాంబియా దేశంలో దగ్గు సిరప్ తాగిన సుమారు 70 మంది చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఆ దేశ పార్లమెంటరీ కమిటీ.. భారత కంపెనీపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దగ్గు సిరప్ ఉత్పత్తిదారుల్ని ప్రాసిక్యూట్ చేయాలని ఆ కమిటీ ప్రతిపాదించింది. కలుషిత దగ్గు మందును సరఫరా చేసిన మెయిడెన్ ఫార్మసీ కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గాంబియా పార్లమెంటరీ ప్యానెల్ పేర్కొన్నది. మెయిడెన్ కంపెనీ దగ్గు సిరప్ల అమ్మకాలు నిలిపివేయాలని అక్టోబర్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ అలర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే.
తమ దగ్గు సిరప్లపై వస్తున్న వదంతుల్ని మెయిడెన్ ఫార్మాసిటికల్స్ కంపెనీ ఖండించింది. అన్ని మార్గదర్శకాలకు తగినట్లే సిరప్లు ఉన్నాయని ఇండియన్ ల్యాబ్స్ పేర్కొన్నాయి. సిరప్లను అవసరంగా డబ్ల్యూహెచ్వో నిందిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. మెయిడెన్ ఫార్మసీ కంపెనీ ఉత్పత్తుల్ని బ్యాన్ చేయాలని, ఆ కంపెనీపై లీగల్ చర్యలు తీసుకోవాలని గాంబియా పార్లమెంటరీ కమటీ ప్రతిపాదించింది. మెయిడెన్ ఫార్మాసీపై చర్యలు తీసుకునేందుకు కమిటీ ఆమోదించింది.
ప్రొమిథజైన్ ఓరల్ సొల్యూషన్, కొఫిగ్జమాలిన్ బేబీ కఫ్ సిరప్, మేకాఫ్ బేబీ కఫ్ సిరప్, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్లు డైఇథలీన్ గ్లైకాల్, ఇథలీన్ గ్లైకాల్తో కలుషితం కావడం వల్ల పిల్లలు మరణించినట్లు గాంబియా పార్లమెంటరీ కమిటీ తన నివేదికలో అభిప్రాయపడింది. డైఇథలీన్ గ్లైకాల్, ఇథలీన్ గ్లైకాల్లు ప్రాణాంతకమైనవి, వాటిని కడుపులోకి తీసుకుంటే మనిషి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.