శ్రీహరికోట : గగన్యాన్ ప్రాజెక్టులో అత్యంత ముఖ్యమైన టీవీ-డీ1ను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి శనివారం ఉదయం 10 గంటలకు రాకెట్ రోదసిలోకి దూసుకెళ్లింది. దీంతో రోదసిలోకి వ్యోమగాములను పంపించడం కోసం చేస్తున్న కృషిలో ఓ ముందడుగు పడింది. ఈ ప్రయోగం విజయవంతమైన అనంతరం ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి మాట్లాడుతూ టీవీ-డీ1 శబ్ద వేగానికి సమానంగా ప్రయాణించిందని, ప్రణాళిక ప్రకారమే క్రూ ఎస్కేప్ సిస్టమ్ పని చేసిందని, క్రూ మాడ్యూల్ సురక్షితంగా బంగాళాఖాతంలో దిగిందని తెలిపారు.
బంగాళాఖాతంలో పడినవాటిని చెన్నై నౌకాశ్రయానికి తీసుకొచ్చే బాధ్యతను భారతీయ నావికా దళం చేపట్టింది. గగన్యాన్ ద్వారా మానవులను 400 కిలోమీటర్ల లో ఎర్త్ ఆర్బిట్లోకి పంపించి, మూడు రోజులపాటు సురక్షితంగా ఉంచి, తిరిగి వారిని భూమిపైకి క్షేమంగా తీసుకురావాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. తొలుత ప్రతికూల వాతావరణం వల్ల ప్రయోగం కాసేపు వాయిదా పడింది. సింగిల్ స్టేజ్ లిక్విడ్ ప్రొపెల్డ్ రాకెట్ ఆకాశంవైపు దూసుకెళ్లడానికి కేవలం 4 సెకండ్లకు ముందు “హోల్డ్” అనే సంకేతం స్క్రీన్స్పై కనిపించింది. సిస్టమ్లో మానిటరింగ్ అనామలీ వల్ల ఇలా జరిగింది.
దీనిని ఇస్రో శాస్త్రవేత్తలు చాలా వేగంగా గుర్తించి, సరిదిద్దారు. మిషన్ కంప్యూటర్, గ్రౌండ్ సపోర్ట్ కంప్యూటర్ ప్రయోగానికి పచ్చ జెండా ఊపడంతో టీవీ-డీ1 దూసుకెళ్లింది. టీవీ-డీ1 నుంచి క్రూ మాడ్యూల్ను క్రూ ఎస్కేప్ సిస్టమ్ దూరంగా తీసుకెళ్లిందని, ఆ తర్వాత క్రూ మాడ్యూల్ కార్యకలాపాలు, క్రూ ఎస్కేప్ సిస్టమ్ వేరుపడటం, పారాచూట్లన్నీ తెరచుకోవడం, తగిన వేగంతో సముద్రంలోకి చేరుకోవడం సజావుగా జరిగినట్లు సోమనాథ్ తెలిపారు.