న్యూఢిల్లీ : వాహనదారులకు గుడ్న్యూస్. పెట్రోల్, డీజిల్, విద్యుత్ అవసరం లేని వాహనాలు త్వరలోనే రహదారులపై దూసుకెళ్లనున్నాయి. ప్రస్తుతం ఆయా ఇంధనాలతో నడిచే కార్లు నడుస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే హైడ్రోజన్తో నడిచే కార్లు అందుబాటులోకి రానున్నాయి. టయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రైవేట్ లిమిటెడ్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ICAT) భారతీయ రోడ్లు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నడిచే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ టయోటా మిరాయ్ పైలెట్ ప్రాజెక్టును బుధవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టును దేశంలో ప్రారంభించడం తొలిసారన్నారు. హైడ్రోజన్తో నడిచే ఎఫ్సీఈవీ (FCEV) కార్బన ఉద్గారాల సమస్యల పరిష్కారంలో ఒకటన్నారు. ఇవి పూర్తిగా పర్యావరణ అనుకూలమైనవన్నారు. పునరుత్పాదక శక్తి, సమృద్ధిగా లభించే బయోమాస్ నుంచి గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేయొచ్చని కేంద్రమంత్రి పేర్కొన్నారు. గ్రీన్ హైడ్రోజన్ను ఉపయోగించే సాంకేతికతను పరిచయం చేయడం.. ఇంధన భవిష్యత్ను సురక్షితం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుందని గడ్కరీ పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్, భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే తదితరులు పాల్గొన్నారు.