ముంబై: గడ్చిరోలిలో మూడు రోజుల క్రితం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో మావోయిస్టు కీలక నేత మృతదేహం లభ్యమైంది. దాంతో ఈ ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టుల సంఖ్య 27కు చేరింది. తాజాగా లభించిన మృతదేహం నక్సల్ కమాండర్ సుఖ్లాల్ పర్చాకీదిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అతనిపై రూ.25 లక్షల రివార్డు ఉన్నదని చెప్పారు. గడ్చిరోలిలో ఈ నెల 13న పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది.
ఎన్కౌంటర్ అనంతరం ఘటనా ప్రాంతంలో పోలీసులకు 26 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిలో రూ.50 లక్షల రివార్డు ఉన్న ఎంఎంసీ జోన్ హెడ్ మిలింద్ తేల్తుంబ్డే, రూ.8 లక్షల రివార్డున్న కోర్చి దళ కమాండర్ కిషన్ అలియాస్ జైమన్ ఉన్నారు. తాజాగా రూ.25 లక్షల రివార్డు ఉన్న సుఖ్లాల్ పర్చాకీ మృతదేహం లభ్యమైంది. అంటే ఈ ఎన్కౌంటర్లో మొత్తం ముగ్గురు కీలక నేతలు మరణించారు. పోలీసుల వైపు సీ-60 యూనిట్కు చెందిన నలుగురు జవాన్లకు గాయాలయ్యాయి.