G20 Summit | జీ20 సదస్సుకు దేశ రాజధాని ఢిల్లీ నగరం సిద్ధమైంది. ఈ నెల 9-10 వరకు జరుగనున్న జీ20 సమావేశాలకు ప్రపంచ దేశాలకు చెందిన అధినేతలు భారత్కు తరలిరానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, జపాన్ ప్రధాని ఫిమియో కిషిడా, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, దక్షిణ కొరియా అధ్యక్షుడు సహా 20 దేశాల అధ్యక్షులు, ప్రధానులు సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి చేరుకోనున్నారు.
జీ20 సదస్సులో పాల్గొనేందుకు నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ న్యూఢిల్లీ చేరుకోగా.. విమానాశ్రయంలో మంత్రి ఎస్పీ సింగ్ బఘెల్ ఆయనకు స్వాగతం పలికారు. ప్రపంచ వాణిజ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ న్గోజీ ఒకోంజో గురువారం రాత్రి న్యూఢిల్లీ చేరుకున్నారు. ఐఎంఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా సైతం G20 సదస్సు కోసం భారత్కు వచ్చారు. వీరితో పాటు యూరోపియన్ యూనియన్ కమీషన్ ప్రెసిడెంట్ ఉర్సుసులా వాన్ డెర్ లేయన్, మారిషస్ పీఎం ప్రవీద్ కుమార్ జగన్నాథ్, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చార్లెస్ మైఖేల్ జీ20 సదస్సు కోసం భారత్ చేరుకున్నారు.
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ గురువారం అమెరికా నుంచి భారత్కు బయలుదేరగా.. ఆయన ఇవాళ సాయంత్రం 7 గంటలకు భారత్ చేరుకునే అవకాశం ఉంది. విమానాశ్రయంలో అమెరికా అధ్యక్షుడికి కేంద్ర సహాయ మంత్రి వీకే సింగ్ స్వాగతం పలుకనున్నారు. బిడెన్తో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జర్మనీ ఛాన్సెలర్ ఒలాఫ్ స్కోల్జ్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్కు ఇవాళ భారత్కు రానున్నారు.
దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా కూడా G20 సమ్మిట్ కోసం భారత్లో పర్యటించనున్నట్లు ధ్రువీకరించారు. G20లో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, రష్యా, మెక్సికో, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికా దేశాలు ఉండగా.. ఈ సారి జీ20 సమావేశాలకు అధ్యక్షత వహిస్తున్న భారత్.. మిత్రదేశాలకు సైతం ఆహ్వానాలు పంపింది.
G20 సదస్సుకు హాజరయ్యేందుకు ప్రపంచంలోని అగ్రశ్రేణి నాయకులు భారత్కు చేరుకుంటుండగా.. సమావేశానికి కొందరు హాజరుకావడం లేదు. ఇందులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ భారత్లో జరగనున్న జీ20 సదస్సులో పాల్గొనేందుకు భారత్కు రావడం లేదు. స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో శాంచెజ్ కూడా భారత్కు రావడం లేదు. పెడ్రో శాంచెజ్ భారతదేశానికి రావాల్సి ఉన్నప్పటికీ, ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ కాగా.. పర్యటన రద్దు చేసుకున్నారు.
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ న్యూఢిల్లీలోని ఐటీసీ మౌర్య షెరటన్ హోటల్లో బస చేయనున్నారు. హోటల్లోని 14వ అంతస్తులో ఉన్న గదిలో బిడెన్ బస చేస్తారు. న్యూఢిల్లీలోని చాణక్యపురిలోని తాజ్ ప్యాలెస్లో చైనా ప్రధాని బస చేయనున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడికి సైతం ఇదే హోటల్లో బస ఏర్పాటు చేశారు. న్యూ ఢిల్లీలోని షాంగ్రీ-లల్లా ఈరోస్ హోటల్లో యూకే ప్రధాని రిషి సునక్ బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే, జర్మన్ ఛాన్సెలర్ ఒలాఫ్ స్కోల్జ్ సైతం ఇదే హోటల్లో ఉండనున్నారు.
ఆస్ట్రేలియా ప్రధాని ఇంపీరియల్ హోటల్లో, టర్కీ ప్రెసిడెంట్ రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఒబెరాయ్ హోటల్లో, ఇటలీ జార్జియా మెలోని మారియట్ హోటల్లో, సౌదీ అరేబియా సుల్తాన్ గురుగ్రామ్లోని లీలా హోటల్లో బస చేస్తారు. జీ20 సమావేశాల సందర్భంగా ప్రపంచదేశాల నేతలు హాజరవుతున్న సందర్భంగా కేంద్రం ఢిల్లీలో భారీ భద్రత కల్పించింది. నగరం నలుదిశలా భారీగా బలగాలను మోహరించింది. అలాగే, నగరంలో విమానాలు, రైళ్లు, బస్సుల రాకపోకలపై సైతం ఆంక్షలు విధించింది.