విశాఖపట్టణం: భారత నౌకాదళంలోకి మరో అత్యాధునిక స్వదేశీ యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి శనివారం అధికారికంగా చేరింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నేవల్ డాక్యార్డ్లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్(Rajnath Singh) ఈ యుద్ధనౌకను జాతికి అంకితం చేశారు. ఆ తర్వాత ఆయన మాట్లాడారు. ఐఎన్ఎస్ మహేంద్రగిరి కేవలం ఒక యుద్ధనౌక మాత్రమే కాదు, భారత నౌకాదళం శక్తి, సామర్థ్యం, స్వావలంబనకు ప్రతీకగా నిలుస్తుందని మంత్రి రాజ్నాథ్ అన్నారు. భవిష్యత్తులో యుద్ధాలు కృత్రిమ మేధతో జరుగుతాయని, కానీ దేశం పట్ల ప్రేమ, సుక్షితులైన సైనికులు, సమర్థవంతమైన సైనిక సత్తా ఉంటే యుద్ధాలను గెలవవచ్చు అని రాజ్నాథ్ పేర్కొన్నారు. భారత రక్షణ, ఏరోస్పేస్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ కొత్త శక్తికేంద్రంగా మారినట్లు ఆయన తెలిపారు. కొత్త టెక్నాలజీలు, సంప్రదాయ విధానాలు ఒకటికి ఒకటి వేరు కాదు అని, ఒకదానిపై ఒకటి ఆధారపడుతాయని, పోటీపడుతాయని, సంప్రదాయ ఫ్లాట్ఫామ్లు లేకుండా.. కొత్త టెక్నాలజీ అసంపూర్ణంగా ఉంటుందని ఆయన అన్నారు.
ఈ యుద్ధనౌకలోని 75 శాతానికి పైగా భాగాలు స్వదేశీ సాంకేతికతతో రూపొందించబడ్డాయి. భారతదేశంలోనే వీటిని తయారు చేశారు.భారతదేశ రూపకల్పన సామర్థ్యం, తయారీ నైపుణ్యం, ఆత్మనిర్భర్ భారత్ సంకల్పం, అలాగే దేశ రక్షణ రంగంలో పెరుగుతున్న స్వదేశీ శక్తికి ఇది సజీవ నిదర్శనమని మంత్రి రాజ్నాథ్ అన్నారు. మజగావ్ డాక్ షిప్బిల్డర్స్ లో ఐఎన్ఎస్ మహేంద్రగిరిని నిర్మించారు. బరాక్, బ్రహ్మోస్ వంటి అత్యాధునిక క్షిపణి వ్యవస్థలతో సముద్రం, గగనతలంలోని లక్ష్యాలను సమర్థవంతంగా ఛేదించే సామర్థ్యం ఈ యుద్ధనౌకకు ఉందని అధికారులు వెల్లడించారు.