న్యూఢిల్లీ, జూన్ 7: న్యూస్ పేపర్లలో చుట్టి అమ్ముతున్న సమోసాలు, పకోడీలు, ఇతర తినుబండారాలు ఆరగిస్తున్నారా? ఇది ఆరోగ్యపరంగా ఎంతమాత్రం క్షేమకరం కాదని హెచ్చరిస్తున్నది భారత అహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఎస్ఐ). ఆహార అమ్మకందారులు, ముఖ్యంగా చిన్న వ్యాపారులు వెంటనే ఈ విధానానికి స్వస్తి పలుకాలని మరోసారి ఆదేశించింది. ఆహార పదార్థ్ధాలను దినపత్రికలలో ప్యాక్ చేయడం, పంపిణీ చేయడం, నిల్వ చేయడం వెంటనే నిలిపివేయాలని పేర్కొన్నది. దినపత్రిక ముద్రణకు వాడే ఇంక్లో ఆరోగ్యానికి హాని చేసే రసాయనాలు వాడుతారని, న్యూస్ పేపర్లలో సమోసాలు, పకోడీలు, వడాపావ్ లాంటి ఆహార పదార్థాలను ఇవ్వడం వల్ల అవి కరిగి ఆ ఆహార పదార్థాలకు, పదార్థాల్లో ఉపయోగించే ఆయిల్కు అంటుకుంటాయని తెలిపింది.
తద్వారా ప్రమాదకర విష రసాయనాలు, లోహ పదార్థాలు శరీరంలోకి వెళ్లి తీవ్ర అనారోగ్యానికి గురి చేస్తాయని ఈ నియంత్రణ సంస్థ తెలిపింది. ఇకపై ఆహార పదార్థాలను దినపత్రికలు, ఇతర ప్రింటింగ్ వస్తువుల్లో ఉంచి ఎట్టి పరిస్థితుల్లో అమ్మకాలు సాగించ రాదని ఈ సంస్థ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. తమ సంస్థ ఆమోదించిన, సూచించిన ఫుడ్ గ్రేడ్ ప్యాకింగ్ పదార్థాలు, కంటైనర్లనే వ్యాపారులు వినియోగించాలని సూచించింది.