న్యూఢిల్లీ: స్థూలకాయం, ఇతర జీవనశైలి వ్యాధులను అరికట్టేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) తన అమ్ముల పొదిలో నుంచి ఎరుపు రంగు షట్కోణ బాక్సుల్లో ‘హై ఫ్యాట్’ ‘హై షుగర్’, హై సాల్ట్’ హెచ్చరికను సరికొత్త అస్త్రంగా తీసుకురానుంది. అనారోగ్యకరమైన ప్యాక్డ్ ఆహారాలపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఈ పదార్థాలు ఎక్కువగా ఉండే ఉత్పత్తుల లేబుళ్లపై హెచ్చరికలు ప్రదర్శించాలని ఎఫ్ఎఎస్ఎస్ఏఐ ప్రతిపాదించింది.
‘ఈ మేరకు ఉత్పత్తుల ముందు భాగంలో చక్కెర, కొవ్వు, ఉప్పుకు సంబంధించిన సమాచారాన్ని చిత్ర రూపంలో అందించేందుకు ఎఫ్ఎస్ఎస్ఏఐ ఒక ప్రతిపాదనను సిద్ధం చేసింది. నిర్దిష్ట పదార్థాలు అధికంగా ఉన్న ఆహార ఉత్పత్తుల గురించి వినియోగదారులకు సులభంగా అర్థమయ్యేలా హెచ్చరికను అందించడమే ఈ ప్రతిపాదన ముఖ్య ఉద్దేశం’ అని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. మరోవైపు ప్రయోగశాల పరీక్షల్లో నాణ్యతా ప్రమాణాలు లోపించాయని తేలడంతో ఎవరెస్ట్, లాల్జీ గోధూ సంస్థల ఇంగువ అమ్మకాలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ తాత్కాలిక నిషేధం విధించింది. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని ఆ కంపెనీలను ఆదేశించింది.