FSSAI | హిందీ భాష అమలుపై భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) వెనక్కు తగ్గింది. పెరుగు పేరు మార్పుపై తాను జారీ చేసిన ఆదేశాలను సవరించింది. పెరుగు ప్యాకెట్లపై ఆంగ్లం పేరుతోపాటు స్థానిక భాషల పేర్లు బ్రాకెట్లలో పెట్టుకోవచ్చునని గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. అంతకుముందు పెరుగు (Curd) పేరును తమిళ భాష పేరు తయిర్ ((Tayir), ఆంగ్లభాష పేరు తొలగించాలని ‘దహీ (Dahi)’ అని హిందీలో మార్చాలని తమిళనాడు మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్కు ఉత్తర్వులు జారీ చేసింది ఇండియన్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ (Indian Food Safety Standard Authority (FSSAI). అంతే కాదు నెయ్యి, చీజ్ వంటి డెయిరీ ఉత్పత్తుల పేర్లు కూడా హిందీలోకి మార్చాలని ఆదేశించింది. తమిళనాడుతోపాటు పొరుగు రాష్ట్రం కర్ణాటకకు ఇవే ఉత్తర్వులను ఎఫ్ఎస్ఎస్ఏఐ పంపినట్లు సమాచారం.
భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిర్ణయంపై తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్రమంతా భగ్గుమన్నది. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలను పాల ఉత్పత్తిదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ‘హిందీని బలవంతంగా రుద్దాలని భావించే వారి పట్టుదల పెరుగుతున్నది. చివరకు పెరుగు ప్యాకెట్పైనా మా సొంత భాషలో ఉన్న పేరు మార్చేసి హిందీలో రాయమని చెబుతున్నారు. మాతృభాషల పట్ల ఇంతటి నిర్లక్ష్యం పనికి కాదు. ఇందుకు బాధ్యులైన వారిని (కేంద్రాన్ని ఉద్దేశిస్తూ) దక్షిణాది శాశ్వతంగా బహిష్కరిస్తుంది’ అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కూడా.. ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.