శ్రీనగర్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కశ్మీర్ పండిట్లకు ఇచ్చిన భరోసా సడలిపోయింది. వారి కలలు, ఆశలు ఆవిరయ్యాయి. ఉగ్రవాదుల దాడుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు సొంత గ్రామాలను వీడిపోతున్నారు. తాజాగా షోపియాన్ జిల్లాలోని ఒక గ్రామాన్ని చివరి కశ్మీరీ పండిట్ మహిళ వీడింది. ఈ నెల 15న చౌదరిగుండ్ గ్రామానికి చెందిన కశ్మీరీ పండిట్ పురాణ్ క్రిషన్ భట్ ఇంటి బయట హత్యకు గురయ్యాడు. రెండు నెలల కిందట షోపియాన్లోని చోటిగాం గ్రామంలోని ఆపిల్ తోటలో ఒక కశ్మీరీ పండిట్ను ఉగ్రవాదులు కాల్చి చంపారు.
ఈ సంఘటనల నేపథ్యంలో చౌదరిగుండ్, చోటిపోరా గ్రామాలకు చెందిన 11 కశ్మీరీ పండిట్ కుటుంబాలు తమ సొంత ఇళ్లను వీడి జమ్మూకు వలస పోయాయి. ఇటీవల పది కశ్మీరీ పండిట్ కుటుంబాలు ఆయా గ్రామాలను వీడాయి. చివరగా హిందూ మహిళ డాలీ కుమారి కూడా గురువారం సాయంత్రం తన గ్రామాన్ని వీడింది. ఈ సందర్భంగా ఆమె ఆవేదన చెందింది. ‘భయానక వాతావరణం నెలకొంది. నేను ఇంకా ఏమి చేయగలను’ అని వాపోయింది.
కాగా, కశ్మీర్ పండిట్ కుటుంబాలన్నీ వీడుతున్నప్పటికీ తాను ధైర్యంతో మరి కొన్ని రోజులు ఉండాలని భావించినట్లు డాలీ కుమారి చెప్పింది. అయితే తన సోదరుడి సూచనతో గ్రామంలోని తన సొంత ఇంటిని వీడుతున్నట్లు ఆమె తెలిపింది. ‘పరిస్థితి మెరుగుపడితే నేను తిరిగి వస్తాను. ఇది నా ఇల్లు. ఇంటిని ఎవరు విడిచిపెట్టాలనుకుంటున్నారు. నేను నా ఇంటిని వదిలి వెళ్ళవలసి వచ్చినందుకు చాలా బాధగా ఉంది’ అని డాలీ కుమారి చెప్పింది. తాము పండించిన ఆపిల్స్ను సంతకు తరలించి అమ్మాలని పొరుగున ఉండే ముస్లిం సోదరుడికి అప్పగించినట్లు ఆమె తెలిపింది. గ్రామాన్ని వీడేందుకు ఆయన సహాయం చేసినట్లు వెల్లడించింది.