కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జనతాదళ్(సెక్యులర్)కు ఆశించిన ఫలితాలు రాలేదు. ఆ పార్టీ 19 స్థానాలకే పరిమితమైంది. గత ఎన్నికల్లో గెలిచిన 37 స్థానాలతో పోలిస్తే ఆ పార్టీకి ఈసారి 18 సీట్లు తగ్గాయి. మొదటి నుంచి పార్టీకి పట్టున్న మైసూర్ ప్రాంతంలో ఆ పార్టీకి 14 సీట్లు లభించాయి. హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో 3, మధ్య కర్ణాటక, బాంబే కర్ణాటక ప్రాంతాల్లో ఒక్కొక్క సీటును గెలుచుకోగలిగింది. మాజీ సీఎం కుమారస్వామి, ఆయన సోదరుడు రేవణ్ణ విజయం సాధించారు. రామనగర నియోజక వర్గంలో కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ ఓటమి చవిచూశారు. ప్రజల తీర్పును స్వాగతిస్తున్నామని, పోరాటం కొనసాగిస్తామని కుమారస్వామి చెప్పారు.
– నేషనల్ డెస్క్
ప్రజల్లో మతాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిపొందుతున్న బీజేపీకి కర్ణాటక ఫలితాలు చెంపపెట్టు లాంటివి. మోదీ నియంతృత్వ పోకడలను నిరసిస్తూ కర్ణాటక ప్రజానీకం ఓటు అనే ఆయుధంతో బీజేపీకి గట్టిగా బుద్ధి చెప్పారు. దేశంలో బీజేపీ పతనం కర్ణాటక నుంచే మొదలైంది. మోదీ తన ప్రాణమిత్రుడైన అదానీకి దేశ సంపదను అప్పనంగా దోచి పెడుతున్నారు.
– తోట చంద్రశేఖర్, బీఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు
మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకున్న బీజేపీకి కర్ణాటక ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. విద్వేష రాజకీయాలు అవసరం లేదని, వికాసంతో కూడిన పరిపాలన కావాలని ప్రజలు కోరుకున్నారు. ఈ దెబ్బతో ఆ పార్టీ దక్షిణాదిలో క్లోజ్ అయింది. కర్ణాటక ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపవు. బీఆర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తుంది.
-వాసుదేవరెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్