తిరువనంతపురం: కేరళను ఎప్పుడూ ఏదో ఒక వైరస్ పట్టి పీడుస్తుంటుంది. తాజాగా బర్డ్ ఫ్లూ కేసులు మళ్లీ వెలుగు చూశాయి. అలప్పుజా జిల్లాలో కొత్తగా బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్కు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ పంపిన కొన్ని నమూనాలను బర్డ్ ఫ్లూ (H5N1 ఇన్ఫ్లుఎంజా)గా గురువారం నిర్ధారించింది. గత వారం ఈ ప్రాంతంలోని కొన్ని బాతులు, కోళ్లు, స్థానిక పక్షులు మరణించాయి. వాటి నమూనాలను ల్యాబ్కు పంపగా బర్డ్ ఫ్లూ కారణంగా అవి చనిపోయినట్లు తేలింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి ప్రభావిత ప్రాంతంలో బాతులు, కోళ్లను నిర్మూలిస్తామని ఆ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు. వాటి పెంపకందారులకు పరిహారం చెల్లిస్తామని చెప్పారు.