పాట్నా: తమ పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (ఆర్ఎల్జేపీ) చీఫ్, కేంద్ర మంత్రి పశుపతి పరాస్ (Pashupati Paras) అన్నారు. ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ తమకు ఉందని ఎన్డీయేను హెచ్చరించారు. బీహార్లో సీట్ల భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)కు ఐదు సీట్లను బీజేపీ కేటాయించింది. దీనిపై పశుపతి పరాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ పార్టీ ఆర్ఎల్జేపీ కూడా ఎన్డీయేలో భాగమేనని తెలిపారు. ప్రధాని మోదీ, అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడ్ని తాను గౌరవిస్తానని చెప్పారు.
కాగా, తమ పార్టీకి బీజేపీ ప్రాధాన్యత ఇవ్వలేదని మీడియాలో వార్తలు వస్తున్నాయని పశుపతి పరాస్ తెలిపారు. దీనిపై తమ పార్టీ నేతలు చాలా అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ‘బీజేపీ తుది జాబితా ప్రకటించే వరకు వేచి చూస్తాం. ఆ తర్వాత మాకు తగిన గౌరవం ఇవ్వకపోతే మేం స్వతంత్రులం. మా తలుపులు తెరిచే ఉన్నాయి. ఎక్కడికైనా వెళ్లడానికి మాకు స్వేచ్ఛ ఉంది’ అని అన్నారు.
మరోవైపు, 1977లో దళిత నేత రామ్ విలాస్ పాశ్వాన్ స్థాపించిన లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) ఆయన మరణించిన ఏడాది తర్వాత 2021లో రెండుగా విడిపోయింది. రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు, చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)కు నేతృత్వం వహిస్తుండగా, రామ్ విలాస్ పాశ్వాన్ సోదరుడు పశుపతి పరాస్ రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ చీఫ్గా ఉన్నారు.