ధర్మపురిలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
పెద్దసంఖ్యలో తరలివస్తున్న భక్తజనం
గోదావరి నదిలో పుణ్యస్నానాలు
ధర్మపురి, మార్చి 26: బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ధర్మపురి లక్ష్మీనారసింహుడి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం హోమాలు, ప్రత్యేక పూజలు చేశారు. యాగశాల వద్ద యజ్ఞాచార్యులు కందాళై పురుషోత్తమాచార్యుల ఆధ్వర్యంలో హోమాలు నిర్వహించారు. రాత్రి శ్రీలక్ష్మీనారసింహ(యోగ, ఉగ్ర) స్వామి వార్లను అశ్వ వాహనంపై ఊరేగించారు. ఈ ఊరేగింపు ఆలయం నుంచి పురవీధుల గుండా ఇసుక స్తంభం వరకు సాగింది. అక్కడ పూజల అనంతరం తిరిగి ఆలయానికి చేరుకున్నది. ఊరేగింపు సేవలో ఈవో శ్రీనివాస్, డీసీఎమ్మెస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, సూపరింటెండెంట్ ద్యావళ్ల కిరణ్కుమార్, వేదపండితులు బొజ్జ రమేశ్శర్మ, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పెరిగిన భక్తుల రద్దీ..
బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచే భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలాచరించారు. అనంతరం స్వామివార్లను దర్శించుకున్నారు. పట్టెనామాలు, కోరమీసాలు సమర్పించుకున్నారు. కోడెమొక్కులు చెల్లించుకున్నారు. వల్లుబండ వద్ద వల్లుపట్టుకున్నారు. శుక్రవారం దాదాపు మూడు వేల మంది భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి 7గంటలకు శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఊరేగింపు సేవ నిర్వహించనున్నట్లు ఈవో శ్రీనివాస్ తెలిపారు.