90 శాతం పెరిగిన కరోనా కేసులు
కొత్త కేసుల్లో 25% రాజధానిలోనే
ఎన్సీఆర్ పరిధిలో ఆంక్షలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: దేశంలో ఫోర్త్ వేవ్ (నాలుగో దశ) మొదలైందా? కరోనా రోజూవారీ కేసుల్లో అనూహ్య పెరుగుదలను గమనిస్తే ఈ అనుమానాలు కలుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 2,183 కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే ఇది 90 శాతం ఎక్కువ. మార్చి 18 తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవ్వడం ఇదే మొదటిసారి. డైలీ పాజిటివిటీ రేటు 0.31 శాతం నుంచి 0.83 శాతానికి ఎగబాకింది.
ఈ పెరుగుదల ఇలాగే కొనసాగితే దేశంలో కరోనా ఫోర్త్వేవ్ వచ్చే ప్రమాదం ఉన్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు రాష్ర్టాల్లో కరోనా ఆంక్షలను ఎత్తివేయడం, పౌరులు మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం నిబంధనలను పాటించకపోవడం, కొత్త వేరియంట్ ఎక్స్ఈ ప్రభావం తదితర కారణాల వల్లే కేసులు పెరుగుతున్నట్టు అంచనా వేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 4,30,44,280 కేసులు నమోదయ్యాయి. తాజాగా 214 మంది మరణించడంతో మృతుల సంఖ్య 5,21,965కి చేరింది.
ఘజియాబాద్లో 144 సెక్షన్
దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా 517 కేసులు నమోదయ్యాయి. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో ఇది 25 శాతం. గత 15 రోజుల్లో ఢిల్లీలో కరోనా వ్యాప్తి దాదాపు 500 శాతం పెరిగిందని తాజాగా ఓ సర్వే పేర్కొన్నది. అయితే, రాజధానిలో పరిస్థితులు మరీ అంత ప్రమాదకరంగా లేవని, దవాఖానలో చేరేవారి సంఖ్య తక్కువగానే ఉన్నదని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. ఢిల్లీలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సరిహద్దుల్లోని యూపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. లక్నోతో సహా రాజధాని పరిధిలోని (ఎన్సీఆర్) ఆరు జిల్లాలు గౌతమ్ బుద్ధ్ నగర్, ఘజియాబాద్, హపూర్, మీరట్, బులంద్షెహర్, బాఘ్పట్లో మాస్కు ధారణను తప్పనిసరి చేసింది. జూన్ 10 వరకు ఘజియాబాద్లో సెక్షన్ 144 విధిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇదిలాఉండగా.. చైనాలోని షాంఘై నగరంలో కరోనాతో ముగ్గురు మృతిచెందారు. ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూసిన తర్వాత నగరంలో మరణాలు నమోదుకావడం ఇదే తొలిసారి.