ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై వేగంగా వెళ్తున్న కారు కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు ఓ చిన్నారి సహా ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు.
గురువారం తెల్లవారుజామున 5:45 గంటలకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. చిన్నారి పుట్టువెంట్రుకలు తీయడానికి కుటుంబసభ్యులంతా కలిసి విద్యాంచల్కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులను రేఖాదేవి (45), కృష్ణాదేవి (70), సవిత (36), రేఖ (32), ఓజాస్ (ఏడాదిన్నర చిన్నారి)గా పోలీసులు గుర్తించారు.