న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ప్రజలు ఇల్లు కట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తున్నది. ఈ పథకం కింది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ (EWS) వారికి రూ.3 లక్షల వరకు, లోయర్ ఇన్కమ్ గ్రూప్ (LIG) వారికి రూ.6 లక్షల వరకు, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ (MIG) వారికి రూ.12 లక్షల వరకు, హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ (HIG) వారికి రూ.18 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తున్నది. ఈ రుణాలపై వడ్డీ రాయితీ సదుపాయం కూడా కల్పిస్తుండటంతో లోన్ కోసం దరఖాస్తులు భారీగానే వస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బారాబంకి జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దరఖాస్తు చేసుకున్న 40 మందికి రుణాలు మంజూరయ్యాయి. అందులో మొదటి విడతగా ఇటీవల ఒక్కో లబ్ధిదారు ఖాతాలో రూ.50 చొప్పున జమచేశారు. అయితే, ఇంటి యజమాని మహిళ ఉండాలని కేంద్రం కండిషన్ పెట్టడంతో మహిళల పేర్ల మీదనే ఈ రుణాలు మంజూరయ్యాయి. దాంతో వాళ్ల బ్యాంకు ఖాతాల్లోనే తొలి విడత నగదును జమ చేశారు.
ఇదే కొందరు భర్తల పాలిట శాపంగా మారింది. ఈ పథకం కింద రుణాలు పొందిన 40 మందిలో నలుగురి భార్యలు కనిపించకుండా పోయారు. వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయిన రూ.50 వేలు కూడా మాయమయ్యాయి. భర్తలు వారి కోసం ఆరా తీయగా వారి భార్యలు తాము ప్రేమించిన వ్యక్తులతో పారిపోయినట్లు తేలింది. ఇలా పారిపోయిన వాళ్లలో బెల్హారా, బాంకీ, జైదాపూర్, సిద్ధౌర్ నగర పంచాయతీల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
కాగా, ప్రభుత్వం ఇచ్చిన లోన్ తీసుకుని భార్యలు పరార్ కావడంతో భర్తలు లబోదిబోమంటున్నారు. మరోవైపు నిధులు మంజూరైనా ఇళ్లు మొదలు పెట్టకపోవడంతో నిధులు రికవరీ చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇంకోవైపు నెలనెలా ఈఎంఐలు సరిగా కట్టకపోతే నోటీసులు అందుకోవాల్సి వస్తుందని బ్యాంకు అధికారులు బెదిరిస్తున్నారు. దీంతో బాధిత భర్తలు జిల్లా కేంద్రంలోని సంబంధిత అధికారులను ఆశ్రయించారు. ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో తమ భార్యలు పారిపోయారని, మిగతా నిధులనైనా వారి ఖాతాల్లో వేయకుండా నిలిపివేయాలని మొరపెట్టుకున్నారు.