నోయిడా: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఓ సీనియర్ నేత ఝలక్ ఇచ్చారు. మూడు దశాబ్దాల కాలంలో నాలుగుసార్లు కాంగ్రెస్ తరఫున లోక్సభ సభ్యుడిగా ఎన్నికైన ఆయన.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పారు. వెంటనే జయంత్ చౌధరి నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్దళ్ (ఆరెల్డీ) పార్టీలో చేరారు. ఆయనే 64 ఏండ్ల అవతార్ సింగ్ భదానా. ఈ విషయాన్ని బుధవారం ఆయనే స్వయంగా ప్రకటించారు.
ఫరీదాబాద్ నియోజకవర్గం నుంచి అవతార్ సింగ్ నాలుగు పర్యాయాలు లోక్సభకు ఎన్నికయ్యారు. చివరగా 2009 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన పోటీచేశారు. అంతకుముందు రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు ఆరెల్డీలో చేరిన ఆయన.. గౌతమ్ బుద్ధనగర్ జిల్లాలోని జవార్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగనున్నారు. అక్కడి నుంచి బీజేపీ తరఫున ధీరేంద్రసింగ్ పోటీ పడుతున్నారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ప్రతిపక్ష సమాజ్వాది పార్టీ, శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, జయంత్ ఛౌదరి నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్దళ్ కూటమిగా బరిలో దిగనున్నాయి. అవతార్ సింగ్ పోటీచేయనున్న జవార్ అసెంబ్లీ స్థానానికి మొదటి దశలో అంటే ఫిబ్రవరి 10న పోలింగ్ జరుగనుంది. మార్చి 10న ఫలితాలు వెల్లడి కానున్నాయి.