Jammu and Kashmir : జమ్మూ కాశ్మీర్లో విషాదం జరిగింది. సాధారణ గస్తీ, తనిఖీ నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు గ్రెనేడ్ పేలి నలుగురు సైనికులు గాయపడ్డారు. ఈ ఘటన జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లా, నౌషేరా సెక్టార్ పరిధిలో మంగళవారం జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కుమావోన్ రెజిమెంట్ యూనిట్కు చెందిన సైనికులు సాధారణ ప్యాట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఒక మల్టీ మోడ్ గ్రెనేడ్ ప్రమాదవశాత్తు పేలిపోయింది.
ఈ ఘటనలో అక్కడ విధులు నిర్వహిస్తున్న నలుగురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురు సైనికులతోపాటు ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీవో) కూడా ఉన్నారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఉన్నతాధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స కొనసాగుతోంది. వారి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. వారంలో ఇది రెండో ఘటన. సాధారణంగా ఆర్మీ సిబ్బంది సరిహద్దు ప్రాంతంలో గస్తీ, నిఘా నిర్వహిస్తుంటారు. నిరంతరం సరిహద్దులో ఈ తరహా తనిఖీలు అక్కడ మామూలే. పైగా రాఔరి జిల్లాలోని ఘటన జరిగిన ప్రాంతం చాలా సున్నితం కావడంతో కొన్ని ఆయుధాలతో తనిఖీ చేస్తుండగా పేలుడు సంభవించింది.
కొన్నిసార్లు ప్రమాదవశాత్తు ఆయుధాలు పేలు సైనికులు మరణించిన ఘటనలు జరుగుతున్నాయి. గత వారం కూడా బారాముల్లా జిల్లాలోని యురి సెక్టార్లో ప్రమాదవశాత్తు ఒక గ్రెనేడ్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు మరణించారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిచగా, అప్పటికే సైనికులు మరణించినట్లు వైద్యులు తెలిపారు.